ఉన్న ఐదు పోస్టులూ ఖాళీ
ABN , Publish Date - Aug 06 , 2025 | 10:51 PM
ముండ్లమూరులోని ఎన్ఎ్సపీ డీఈ కార్యాలయం ఖాళీ అయ్యింది. ఇక్కడ మొత్తం ఐదు జేఈ పోస్టులు ఉండగా ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు. గత ఏడాది నుంచి కేవలం ఒక్క ఇన్చార్జ్ జేఈ మాత్రమే ఉన్నారు. ఆ కార్యాలయం పరిధిలోని మోదేపల్లి మేజరు బాధ్యతలను ఐదుగురు జేఈలు పర్యవేక్షించాలి. ప్రస్తుతం మేజరు కాలువలకు ఆధునికీకరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.వాటిని పర్యవేక్షించాల్సిన అధికారులు లేకపోవటం వల్ల నాణ్యతపై నీలినీడలు కమ్ముకొన్నాయి.
ముండ్లమూరు ఎన్ఎ్సపీ డీఈ కార్యాలయంలో జేఈల కొరత
కొనసాగుతున్న సాగర్ కాలువల ఆధునికీకరణ
పర్యవేక్షణ కొరవడిన వైనం
ఒక్క ఇన్చార్జితో నెట్టుకొస్తున్న యంత్రాంగం
పది లస్కర్ పోస్టులకు గాను ఒక్కరే విధులు
ముండ్లమూరు, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : ముండ్లమూరులోని ఎన్ఎ్సపీ డీఈ కార్యాలయం ఖాళీ అయ్యింది. ఇక్కడ మొత్తం ఐదు జేఈ పోస్టులు ఉండగా ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు. గత ఏడాది నుంచి కేవలం ఒక్క ఇన్చార్జ్ జేఈ మాత్రమే ఉన్నారు. ఆ కార్యాలయం పరిధిలోని మోదేపల్లి మేజరు బాధ్యతలను ఐదుగురు జేఈలు పర్యవేక్షించాలి. ప్రస్తుతం మేజరు కాలువలకు ఆధునికీకరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.వాటిని పర్యవేక్షించాల్సిన అధికారులు లేకపోవటం వల్ల నాణ్యతపై నీలినీడలు కమ్ముకొన్నాయి.
మోదేపల్లి మేజరు పరిధిలో 38వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అందులో 20వేల ఎకరాల మాగాణి భూములు కాగా, 18వేలు ఎకరాల మెట్ట ఉంది. మరో వారం పది రోజుల్లో కాలువలకు సాగర్ జలాలు రానున్నాయి. రైతులు మాగాణి పైరు సాగు చేయటానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో జేఈ పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో సక్రమంగా సాగర్ జలాలు దిగువకు సక్రమంగా నీరు సరఫరా అవుతాయా, లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. పమిడిపాడు బ్రాంచ్ పరిధిలో మోదేపల్లి మేజరులో జమ్మలమడక మేజరు కాలువ కూడా ఉండటం అది పల్నాడు జిల్లా పరిధిలోనిది కావడంతో ఇంకొంత ఇబ్బంది వాతావరణం నెలకొంది. చివరి భూముల రైతులకు ప్రతి ఏడాది నీరు చేరటం కష్టంగా మారింది. దీనికి తోడు లస్కర్ల 15 ఉండాల్సి ఉండగా కేవలం ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వర్క్ ఇన్స్పెక్టర్ కూడా ఒక్కరే ఉన్నారు. మోదేపల్లి మేజరు పరిధిలో గాంధీనగర్, వేముల, ఈదర, వేములబండ, ఉమామహేశ్వర అగ్రహారం, పూరిమెట్ల, నాయుడుపాలెం, తమ్మలూరు, మారెళ్ల, జమ్మలమడక, శంకరాపురం, పోలవరం, కుంకుపాడు, మోదేపల్లి ఆయకట్టు రైతులకు నీరు చేరాల్సి ఉంది. ఇప్పటికైనా కలెక్టర్, ఎన్ఎ్సపీ ఎస్ఈ స్పందించి ఖాళీగా ఉన్న జేఈ పోస్టులను తక్షణమే భర్తీ చేసి ఆయకట్టు పరిధిలోని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని రైతులు వేడుకుంటున్నారు.
జేఈ పోస్టులను భర్తీ చేయాలి
కంచుమాటి శ్రీనివాసరావు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్, మోదేపల్లి మేజరు
మోదేపల్లి మేజరు పరిధిలో ఐదు జేసీ పోస్టులకు ఒక్కరు కూడా లేరు. ఒక ఇన్చార్జ్ జేఈ మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం మోదేపల్లి మేజరులో ముమ్మరంగా సాగర్ కాలువల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. కనీసం పనులు పర్యవేక్షించటానికి అధికారులు లేకపోవటం వల్ల పనుల్లో అక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.