వ్యసనాలకు లోనై.. యూట్యూబ్ చూసి..
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:21 PM
వారంతా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు. ఒంగోలులోని ప్రముఖ ఇంజనీరింగ్
వరసగా బుల్లెట్ వాహనాల అపహరణ
ఏడుగురు బీటెక్ విద్యార్థుల ముఠా అరెస్టు
యూటూబ్లో చూసి లాక్ తీయడంలో శిక్షణ
16 బుల్లెట్ వాహనాలు, ఒక స్కూటీ రికవరీ
వివరాలను వెల్లడించిన చీరాల డీఎస్పీ మొయిన్
అద్దంకి, జూలై 15(ఆంధ్రజ్యోతి): వారంతా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు. ఒంగోలులోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. చెడు వ్యసనాలకు లోనైన వీరు చోరీల బాటపట్టారు. ఏకంగా 16 బుల్లెట్ వాహనాలను చోరీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి చీరాల డీఎస్పీ మొయిన్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఒంగోలు పట్టణంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పైనల్ ఇయర్ చదువుతున్న అద్దంకికి చెందిన పల్లా సాయిరాం, పల్నాడు జిల్లా రెంటచింతల మండలం నార్లగెడ్డ గోవిందరాజు, నెల్లూరు జిల్లా కావలి మండలం చౌదరి పాలెంకు చెందిన కోడెల పవన్కుమార్, ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం యడ్లూరిపాడుకు చెందిన దివి వేణుగోపాల్, దర్శి మండలం తూర్పు వీరాయపాలేనికి చెందిన రాయపూడి వసంతకుమార్, ఎన్టీఆర్ కృష్ణజిల్లా , కంచికిచర్ల మండలం, కొత్త పెండ్యాలకు చెందిన జీనేపల్లి నరేంద్రవర్మ, ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఆలూరుకు చెందిన అక్కల వెంకటసాయిరెడ్డిలు ఒంగోలులోని వీఐపీరోడ్డులోని హిందూ శ్మశాన వాటిక సమీపంలో ఉంటూ కళాశాలకు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో వీరు చెడు వ్యసనాలకు లోనయ్యారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో యూట్యూబ్లో బుల్లెట్ వాహనం హ్యండిల్ లాక్ ఎలా తీయాలి, ఎలా స్టార్ట్ చేయాలనే విషయాన్ని గోవిందరాజు తోటి స్నేహితులకు వివరించాడు. తొలుత కొటప్పకొండ తిరునాళ్లలో బుల్లెట్ వాహనాన్ని దొంగిలించారు. అనంతరం సింగరకొండ తిరునాళ్లలో పార్కింగ్ చేసిన మరో బుల్లెట్ వాహనాన్ని దొంగిలించారు. ఆ తరువాత అద్దంకి పట్టణంలోని చిన్న గానుగపాలెం, కాకానిపాలెం, దామావారిపాలెం, ఆర్టీసీ బస్టాండ్, పాత ఆంధ్రబ్యాంక్, సింగరకొండ గుడివద్ద వాహనాలను దొంగిలించారు. అదేక్రమంలో జె.పంగులూరు పోలి్సస్టేషన్ పరిధిలో ఒక బుల్లెట్, ఒక స్కూటీ, చిలకలూరిపేట పోలీ్సస్టేషన్ పరిధిలో మూడు బుల్లెట్ వాహనాలు, నరసరరావు పోలీ్సస్టేషన్ పరిధిలో ఒకటి, మద్దిపాడు పోలీ్సస్టేషన్ పరిధిలో ఒకటి, మేదరమెట్ల పోలీ్సస్టేషన్ పరిధిలో ఒకటి చొప్పున వాహనాలను దొంగిలించారు. వీటిలో కొన్నింటిని వినియోగించుకుంటూ, మిగిలినవి అద్దంకి పట్టణంలోని బ్రహ్మనందం కాలనీలోని పాడుబడిన భవనంలో దాచిపెట్టారు. బాపట్ల జిల్లా ఎస్పీ తూషార్ డూడీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా అద్దంకి టౌన్ సీఐ సుబ్బారాజు ఆధ్వర్యంలో దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని రూ.25.20 లక్షల విలువైన 16 బుల్లెట్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. మోటర్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడిన ముఠాను అరెస్టు చేసిన చీరాల డీఎస్పీ మొయిన్, అద్దంకి పట్టణ సీఐ సుబ్బారావు, ఏఎస్ఐ వసంతరావు, హెడ్ కానిస్టేబుల్ అంకమ్మరావు, సిబ్బంది వి.బ్రహ్మయ్య, పి.బ్రహ్మయ్య, వెంకటగోపయ్యలను జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ప్రత్యేకంగా అభినందించారు.