విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:41 PM
వసతి గృహాలలోని సిబ్బంది విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ హెచ్చరించారు
అమ్మనబ్రోలు గురుకుల పాఠశాల, ఎస్సీ వసతి గృహం తనిఖీ చేసిన ఇన్చార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ
నాగులుప్పలపాడు, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : వసతి గృహాలలోని సిబ్బంది విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ హెచ్చరించారు. అమ్మనబ్రోలు గ్రామంలోని గురుకుల పాఠశాల, ఎస్సీ వసతి గృహాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఎస్సీ బాలుర వసతి గృహంలో వసతులను పరిశీలించారు.హాజరు, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. స్టోర్ రూమ్లో రిజిస్టర్ ప్రకారం సరుకులు లేకపోవడం, నిల్వలలో తేడా ఉండటం గుర్తించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని వార్డెన్ను ఆదేశించారు. వసతిగృహంలోని కిటికీలకు దోమతెర మెష్లను ఏర్పాటు, మరుగుదొడ్లు మరమ్మతులు చేయించాలని, ఫిర్యాదుల పెట్టె, ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థినులతో కొద్దిసేపు ముచ్చటించారు. పాఠ్యాంశాల సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించారు. కొన్ని విషయాలను ప్రిన్సిపాల్ మాధవిని అడిగి తెలుసుకొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మెనూ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో అనేక సంస్కరణలను చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతులను కల్పనకు నిధులు అందిస్తున్నట్లు చెప్పారు. అదే స్ఫూర్తితో ఉపాధ్యాయులు పనిచేయాలని చెప్పారు. విద్యార్థినులకు ఇన్చార్జ్ కలెక్టర్ స్వయంగా భోజనం వడ్డించి రుచి చూశారు. సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారిణి నిర్మలాజ్యోతి, తహసీల్దార్ కె.ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.