సరికొత్త సంకటం
ABN , Publish Date - May 21 , 2025 | 01:09 AM
ఒంగోలు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) విద్యార్థులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మూడు కేంద్రాల్లో తరగతులు నిర్వహించనున్నారు. పిల్లి కాపురం మాదిరిగా అక్కడో సంవత్సరం, ఇక్కడో రెండు సంవత్సరాలు, మరోచోట మూడు సంవత్సరాలు వీరికి తరగతులు నిర్వహించనున్నారు.
ఒంగోలు ట్రిపుల్ ఐటీకి మూడు క్యాంపస్లు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరిన్ని తిప్పలు
కొత్తవిద్యార్థులకు నూజివీడులో తరగతులు
‘రావ్ అండ్ నాయుడు’ క్యాంపస్ మూత
సొంత భవనాలు నిర్మించకపోవడంతోనే కష్టాలు
ఒంగోలు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) విద్యార్థులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మూడు కేంద్రాల్లో తరగతులు నిర్వహించనున్నారు. పిల్లి కాపురం మాదిరిగా అక్కడో సంవత్సరం, ఇక్కడో రెండు సంవత్సరాలు, మరోచోట మూడు సంవత్సరాలు వీరికి తరగతులు నిర్వహించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందే విద్యార్థులకు మొదట నూజివీడులో తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. ఒంగోలులోని రావ్ అండ్ నాయుడు క్యాంపస్ మూసివేతతో ఈ సంకటం తలెత్తింది.
ఒంగోలు విద్య, మే 20 (ఆంధ్రజ్యోతి) : తొమ్మిదేళ్ల క్రితం ఆవిర్భవించిన ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఇప్పటివరకు సొంత భవనాలు సమకూరలేదు. గత వైసీపీ పాలనలో ఐదేళ్లు శాశ్వత భవనాలు నిర్మించాలన్న ఆలోచన కూడా చేయలేదు. కనీసం అవసరమైన స్థలాన్ని కూడా ఖరారు చేయలేదు. ఇడుపులపాయలోని ఆర్కేవ్యాలీ, ఒంగోలులోని రెండు అద్దె భవనాల్లో ఇప్పటివరకూ తరగతులు నిర్వహిస్తూ ఏదో ఒకవిధంగా నెట్టుకొచ్చారు. ఒంగోలులోని రావ్ అండ్ నాయుడు ఇంజనీరింగ్ కళాశాలను మూసివేయాలని నిర్ణయించడంతో ఒక సంవత్సరం విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో వసతి కల్పిస్తున్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఇప్పటి వరకు ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ, ఒంగోలు కేంద్రాల్లో తరగతులు నిర్వహిస్తుండగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడు కేంద్రాల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు ఒంగోలు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ భాస్కర్ పటేల్ తెలిపారు.
ప్రస్తుతం నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఖాళీగా ఉన్న భవనాల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందనున్న ఒంగోలు ట్రిపుల్ఐటీ విద్యార్థులకు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం తరగతులు నిర్వహిస్తారు. ఇక్కడ 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు ఖాళీగా ఉన్నాయి. వీరికి అక్కడ వసతి, తరగతులు నిర్వహించడం ద్వారా వాటిని వినియోగంలోకి తెస్తున్నారు. నూజివీడులో మొదటి సంవత్సరం పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి ఇడుపులపాయ వెళ్తారు.
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరానికి ఒంగోలు రావాల్సి ఉంది. అయితే ఒంగోలులో రావ్అండ్నాయుడు కాలేజీ క్యాంపస్ మూసివేసినందున వారు ఇడుపులపాయలోనే ఇంజనీరింగ్ మొదటి సంవత్సరానికి ఉంటారు. ప్రస్తుతం అక్కడ ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తిచేసిన వారు ద్వితీయ సంవత్సరానికి అక్కడే ఉంటారు. దీంతో రెండు సంవత్సరాల విద్యార్థులు అక్కడే ఉన్నట్లు అవుతుంది. ఒంగోలులోని ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ ఇంజనీరింగ్ 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారు.
ఏడాదిలో సొంత భవనాలు
ఒంగోలులోని ట్రిపుల్ఐటీకి ఏడాదిలో సొంత భవనాలు సమకూర్చనున్నట్లు ఆర్జీయూకేటీ చాన్స్లర్ మధుమూర్తి హామీ ఇచ్చినట్లు డైరెక్టర్ భాస్కర్ పటేల్ తెలిపారు. ట్రిపుల్ఐటీకి స్థల సేకరణ, భవన నిర్మాణాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించేందుకు ఏడుగురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. ఒంగోలు ట్రిపుల్ఐటీకి కనీసం 30 ఎకరాలు కేటాయిస్తే బహుళ అంతస్థుల భవనాలు నిర్మించుకొని తరగతులు, విద్యార్థులకు వసతి కల్పిస్తామని కలెక్టర్ను, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించనున్నట్లు ఆయన తెలిపారు. స్థల సేకరణకు కమిటీ సభ్యులు కనిగిరిలో తిరిగి భూములు పరిశీలించారన్నారు. ఏడాదిలోపు ప్రక్రియను పూర్తి చేసి తాత్కాలిక భవనాలైనా నిర్మించి 2026-27 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఇక్కడే తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని భాస్కర్ పటేల్ తెలిపారు.