నగరానికి ‘పచ్చ’లహారం
ABN , Publish Date - Sep 16 , 2025 | 10:11 PM
పదికాలాలపాటు.. అందరూ చెప్పుకునేలా.. ప్రతి ఒక్కరికీ చల్లని నీడనిచ్చే విధంగా నగరం పచ్చలహారంగా తీర్చిదిద్దడంపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రత్యేక దృష్టి సారించారు.
ఒక్కో మొక్కను ఒక్కో విద్యార్థి దత్తతకు ప్రణాళిక
కమిషనర్, విద్యాసంస్థల యాజమాన్యాలతో ఎమ్మెల్యే దామచర్ల సమావేశం
ఒంగోలు కార్పొరేషన్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : పదికాలాలపాటు.. అందరూ చెప్పుకునేలా.. ప్రతి ఒక్కరికీ చల్లని నీడనిచ్చే విధంగా నగరం పచ్చలహారంగా తీర్చిదిద్దడంపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రత్యేక దృష్టి సారించారు. నగర అభివృద్ధిలో భాగంగా విద్యుత్ దీపాలు.. రోడ్లు, డ్రైయిన్లు, డివైడర్ల నిర్మాణంతోపాటునగరానికి ‘పచ్చ’లహారం వేసేందుకు శ్రీకారం పలికారు. ఈ మేరకు ఒంగోలు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరమంతా సుమారు 5వేల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఎమ్మెల్యే దామచర్ల మంగళవారం నగర కమిషనరు కే వెంకటేశ్వరరావుతోపాటు పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలు, పలు విద్యా సంస్థల యజమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దామచర్ల అధికారులకు, విద్యా సంస్థల యజమానులకు పలు సూచనలు చేశారు. నగరంలో పచ్చదనం పెంపుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ముఖ్యంగా మొక్కలు వేసి, అలాగే వదిలేయకుండా ఒక్కో మొక్కను, ఒక్కో విద్యార్థికి దత్తత ఇచ్చి, వాటి సంరక్షణ బాధ్యతలు అప్పగించడం ద్వారా భవిష్యత్లో నగరం అందమైన మొక్కలు, పచ్చదనంతో సుందరంగా మారుతుందని తెలిపారు. నగర అభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో సమష్టిగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.