సాగుకు ఊతం
ABN , Publish Date - Jul 19 , 2025 | 02:00 AM
ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. గురువారం రాత్రి జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. సాగులో ఉన్న పంటలకు ప్రాణం పోసింది.
జిల్లావ్యాప్తంగా మోస్తరు వర్షం
సగటున 34.7 మి.మీ నమోదు
పశ్చిమాన భారీగానే కురిసిన వాన
పలుచోట్ల పొలాల్లోకి చేరిన నీరు
అక్కడక్కడా పొంగిపొర్లిన వాగులు
ఎండల నుంచి ఉపశమనం
ఒక్కసారిగా తగ్గిన ఉష్ణోగ్రతలు
ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. గురువారం రాత్రి జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. సాగులో ఉన్న పంటలకు ప్రాణం పోసింది. దాదాపు నెలన్నరగా చినుకు జాడలేక తీవ్రమైన ఎండలతో తల్లడిల్లుతున్న ప్రజానీకానికి ఉపశమనం లభించింది. దుక్కులు దున్ని విత్తనం వేసేందుకు భూమిలో తేమలేక ఎదురుచూస్తున్న రైతులకు తాజా వర్షం మేలు చేసింది. జిల్లాలో శుక్రవారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో సగటున 34.7మి.మీ వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో ఒక మోస్తరుగా పడింది. పశ్చిమప్రాంతంలో మాత్రం భారీగా కురిసింది. ఒంగోలు పరిసర ప్రాంతంలోనూ మంచి వర్షమే పడింది.
ఒంగోలు, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి వర్షం కురిసింది. తూర్పుప్రాంతంలో ఓ మోస్తరుగా, పశ్చిమప్రాంతంలో భారీగా పడింది. గరి ష్ఠంగా ఎర్రగొండపాలెం మండలంలో 122.40 మి.మీ వర్ష పాతం నమోదైంది. టంగుటూరులో 88.0, కొత్తపట్నంలో 77.4, మద్దిపాడులో 70.20, జరుగుమల్లిలో 68.40, తాళ్లూరులో 58.80, దర్శిలో 54.6, సంతనూతలపాడులో 52.6 మి.మీ కురిసింది. పుల్లలచెరువు, తర్లుపాడు, బేస్తవారపేట, రాచర్ల, దొనకొండ, పెద్దారవీడు, చీమకుర్తి, కొండపి, మార్కాపురం, పొన్నలూరు, నాగులుప్పలపాడు తదితర మండలాల్లో 30 నుంచి 50 మి.మీ మేర నమోదైంది. తూర్పు ప్రాంతంలో నెలన్నర నుంచి జల్లులు లేకపోగా పశ్చిమాన వారం క్రితం ఒక మోస్తరు వర్షం కురిసింది. తాజా వర్షంతో పశ్చిమప్రాంతంలోని పలుచోట్ల పొలాల్లోకి నీరు చేరింది. అక్కడక్కడా వాగులు, చెరువుల్లో నీటి ప్రవాహం మొదలైంది. ప్రధానంగా పెద్దారవీడు మండలంలోని నల్లవాగులోకి వరద నీరు ఉధృతి పెరిగింది. రాచర్ల, ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు తదితర మండలాల్లో వాగులు, వంకలు పొంగాయి. అదేప్రాంతంలోని పలు గ్రామాల్లో ప్రస్తుతం కురిసిన వర్షం జిల్లా ప్రజలకు, ప్రత్యేకించి రైతాంగానికి అన్ని విధాలా మేలు చేయనుంది.
పంటలకు ప్రాణం
జిల్లాలో ప్రస్తుత సమయం ముమ్మర ఖరీఫ్ సీజన్ కాగా నెలన్నరగా సరైన వర్షం లేక పంటలు సాగు ముందుకు సాగలేదు. జిల్లాలో ఖరీఫ్లో సుమారు లక్షా 29వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి. అందులోనూ ఈ సమయానికి కనీసం 50వేల నుంచి 60వేల హెక్టార్లలో సాగు కావాల్సి ఉంది. తొలకరి పైర్లు అయిన నువ్వు, సజ్జ, ఇతర పశుగ్రాస పచ్చిరొట్ట ఎరువుల పైర్లు నెలక్రితమే వేసి బాగా ఎదుగుదల దశకు చేరతాయి. అలాగే ప్రధాన ఖరీఫ్ పంటలైన కంది, పత్తి, మిర్చి, ఇతరత్రా సాగు ముమ్మరంగా ఉండాలి. అయితే జూన్లో 35శాతం, ఈనెలలో 17వతేదీ వరకు 55శాతానికిపైగా లోటు వర్షపాతంతో సాగు ముందుకు సాగలేదు. కేవలం పదిన్నర వేల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగ య్యాయి. అందులో పత్తి 40శాతం కాగా మిగిలిన ప్రధాన పంటలు అతి తక్కువగా ఉన్నాయి. తీవ్ర వర్షభావంతో ఆ పంటలు కూడా వాడుముఖం పట్టా యి. ఈ సమయంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షం సాగుకు ఊతం ఇచ్చింది.
పదునెక్కిన భూములు
తాజా వర్షం ఇప్పటికే సాగులో ఉన్న పైర్లకు ఉపయోగంతోపాటు దుక్కులు దున్ని సాగుకు సిద్ధంగా ఉంచిన భూములు బాగా పదునెక్కాయి. ఆ భూముల్లో ఈ వర్షంతో కంది, పత్తి, మిర్చి మొక్కజొన్న, మినుము వంటి పంటలను సాగు చేసే అవకాశం ఏర్పడింది. అలాగే వరి సాగుకు అవసరమైన చర్యలను కూడా రైతులు తీసుకోనున్నారు. మరోవైపు వర్షాలు లేక వేసవిని తలపిస్తూ జిల్లాలో మండుతున్న ఎండల నుంచి కూడా తాజా వర్షంతో ప్రజలకు ఉపశమనం లభించింది. దాదాపు పక్షంరోజులుగా జిల్లాలో నిత్యం 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుతోపాటు వేడిగాలులు, ఉక్కపోత వాతావరణం నెలకొని ప్రజానీకం తల్లడిల్లిపోయారు. సాయంత్రం ఆరేడు గంటల సమయంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం మరింత ఇబ్బందిపెట్టింది. ఇలాంటి సమయంలో విస్తారంగా వర్షం పడటంతో శుక్రవారం పగటిపూట నాలుగైదు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గాయి. జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో 35 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండగా అత్యధిక ప్రాంతాలు 35 డిగ్రీల కన్నా తక్కువగానే నమోదైంది. చాలా ప్రాంతాల్లో పగటిపూట మబ్బులు కమ్మి ఉండటం ఉపశమనం కలిగించింది.