పీఎస్ హెచ్ఎంలుగా 509 మంది
ABN , Publish Date - Jun 01 , 2025 | 01:34 AM
జిల్లాలో నూతనంగా ఆవిర్భవించిన మోడల్ ప్రైమరీ స్కూళ్లకు ప్రధానోపాధ్యాయులుగా 509 మంది స్కూలు అసిస్టెంట్లు నియమితులు కానున్నారు. ఈమేరకు చురుగ్గా ప్రక్రియ సాగుతోంది. తొలుత టీచర్ల పునర్విభజనలో మిగులుగా తేలిన స్కూలు అసిస్టెంట్లను ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా నియమించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.
స్కూల్ అసిస్టెంట్ల నియామకం
సర్వీసులో జూనియర్లపై పిడుగు
ఒంగోలు విద్య, మే 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నూతనంగా ఆవిర్భవించిన మోడల్ ప్రైమరీ స్కూళ్లకు ప్రధానోపాధ్యాయులుగా 509 మంది స్కూలు అసిస్టెంట్లు నియమితులు కానున్నారు. ఈమేరకు చురుగ్గా ప్రక్రియ సాగుతోంది. తొలుత టీచర్ల పునర్విభజనలో మిగులుగా తేలిన స్కూలు అసిస్టెంట్లను ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా నియమించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో స్కూలు అసిస్టెంట్ తెలుగు 115 మంది, హిందీ 23 మంది, ఇంగ్లీషు 139 మంది, గణితం 134 మంది, సోషల్ స్టడీస్ 90మంది, బయోలాజికల్ సైన్స్ ముగ్గురు, ఉర్దూ ముగ్గురు, సంస్కృతం ఇద్దరు మిగులుగా తేలినట్లు నిర్ధారించారు. దీంతో వీరందరినీ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా నియమించేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మిగులుగా తేలిన 509 మంది మోడల్ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా బదిలీల్లో కోరుకోవాల్సి ఉంది.
జూనియర్ల బదిలీ తప్పనిసరి!
స్కూలు అసిస్టెంట్లకు సంబంధించి సర్వీసులో ఆయా సబ్జెక్టుల్లో జూనియర్లు అయిన టీచర్లపై బదిలీ పిడుగు పడనుంది. జూనియర్లు ప్రస్తుతం తాము పనిచేస్తున్న పాఠశాలల్లో మిగులుగా తేలకపోయినా వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సిందేనని పాఠశాల విద్య కమిషనర్ స్పష్టం చేశారు. శనివారం నిర్వహించిన వెబెక్స్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. హెచ్ఎం ఉద్యోగోన్నతులు కోసం ఇటీవల సబ్జెక్టు వారీగా తయారుచేసిన సీనియారిటీ జాబితాల ఆధారంగా ఆయా సబ్జెక్టుల్లో జూనియర్లుగా ఉన్న వారిని గుర్తించి వారిని పీఎస్ హెచ్ఎంలుగా పంపించమన్నారు. వారు ఇప్పటికే బదిలీకి దరఖాస్తు చేసుకోకపోతే ఆదివారం వారందరినీ పిలిపించి వారితో దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. పీఎస్ హెచ్ఎం/ఎస్ఏ పోస్టుకు సీనియర్ టీచర్లు కూడా ఆప్షన్లు ఇవ్వవచ్చు. ఒకవేళ సీనియర్ టీచర్లు పీఎస్ హెచ్ఎంలుగా వెళితే వారి దామాషా ప్రకారం జూనియర్ టీచర్లు బదిలీ కాకుండా వారి స్థానాల్లో కొనసాగవచ్చు. జూనియర్ టీచర్లు మాత్రం తప్పనిసరిగా అన్ని పీఎస్ హెచ్ఎం పోస్టులకు ఆప్షన్లు పెట్టుకోవాల్సిందే. బదిలీ పిడుగు పడనుండటంతో వారు ఆందోళనకు గురవుతున్నారు.