4 వేల మంది టీచర్లకు స్థానచలనం!
ABN , Publish Date - May 14 , 2025 | 01:13 AM
ఉమ్మడి జిల్లాలో త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కసరత్తు పూర్తయ్యింది. సుమారు 4వేల మందికి స్థానచలనం కలగనుంది. 2017లో జరిగిన బదిలీల్లో ఇతర పాఠశాలలకు వెళ్లిన టీచర్లందరూ ప్రస్తుతం బదిలీ కావాల్సి ఉంది. ఒకేచోట ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న హెచ్ఎంలు, ఎనిమిదేళ్లు పూర్తయిన ఇతర టీచర్లు తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారి జాబితాలో ఉన్నారు.
ఖాళీలపై కసరత్తు పూర్తి
కమిషనర్ వెబ్సైట్లో వివరాలు
ఒంగోలు విద్య, మే 13 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కసరత్తు పూర్తయ్యింది. సుమారు 4వేల మందికి స్థానచలనం కలగనుంది. 2017లో జరిగిన బదిలీల్లో ఇతర పాఠశాలలకు వెళ్లిన టీచర్లందరూ ప్రస్తుతం బదిలీ కావాల్సి ఉంది. ఒకేచోట ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న హెచ్ఎంలు, ఎనిమిదేళ్లు పూర్తయిన ఇతర టీచర్లు తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారి జాబితాలో ఉన్నారు. పాఠశాలల్లో మిగులుగా తేలిన టీచర్లందరూ బదిలీకి దరఖాస్తు చేసుకోవాల్సిందే. మెరుగైన స్థానాలకు బదిలీ కోరుకొనే జాబితాలో 4వేల మంది ఉన్నారు. బదిలీ అయ్యేవారిలో సింహభాగం సెకండరీ గ్రేడ్ టీచర్లే. జిల్లాలోని మొత్తం ఉపాధ్యాయుల్లో సుమారు మూడోవంతు మందికి స్థానచలనం కలగనుంది. ప్రస్తుతం ఉన్న క్లియర్ వేకెన్సీలు, మే 31 నాటికి ఉద్యోగ విరమణ ద్వారా వచ్చే ఖాళీలు, ఒకే పాఠశాలలో ఐదేళ్లు పూర్తయిన హెచ్ఎంలు, 8 సంవత్సరాలు పూర్తయిన టీచర్ల స్థానాలను ఖాళీలుగా చూపించారు. ఒక పాఠశాలలో మిగులుగా తేలిన టీచర్లను అవసరమున్న చోటుకు సర్దుబాటు చేసి ఆస్థానాలను ఖాళీలుగా చూపించారు. స్టడీ లీవ్, పొరుగు సేవలు, అనధికారికంగా గైర్హాజరైన టీచర్ల స్థానాలను ఖాళీలుగా ప్రకటించారు. 1998, 2008 డీస్సీ వారు కాంట్రాక్టు విధానంతో మినిమం టైం స్కేలుతో పనిచేస్తున్న టీచర్ల స్థానాలన్నింటినీ ఖాళీలుగా చూపించారు. దివ్యాంగ టీచర్లతోపాటు, ఎగనెస్ట్ పోస్టుల్లో పనిచేస్తున్న వారి స్థానాలను ఖాళీగా చూపించలేదు. ఖాళీల వివరాలను పాఠశాల విద్య కమిషనర్ వెబ్సైట్లో పొందుపర్చారు.