క్రమబద్ధీకరణకు నోచుకోని 22ఏ భూములు
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:14 PM
అధికారుల నిర్లక్ష్యంతో 22ఏలో చేరిన పట్టాభూములు ఏళ్ల తరబడి క్రమబద్ధీకరణకు నోచుకోక హక్కుదారులు అల్లాడుతున్నారు. తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ పనులు జరగకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు 22ఏలో నుంచి తొలగిస్తామని రైతుల వద్ద లక్షలాది రూపాయల ముడుపులు తీసుకొని పనులు చేయకుండా వెళ్లిపోయారు.
తహసీల్దార్ కార్యాలయాల
చుట్టూ ప్రదక్షిణలు
గత వైసీపీ పాలనలో ముడుపులు తీసుకున్న అధికారులు
సమస్య పరిష్కారంకాక రైతుల ఇక్కట్లు
దర్శి, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): అధికారుల నిర్లక్ష్యంతో 22ఏలో చేరిన పట్టాభూములు ఏళ్ల తరబడి క్రమబద్ధీకరణకు నోచుకోక హక్కుదారులు అల్లాడుతున్నారు. తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ పనులు జరగకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు 22ఏలో నుంచి తొలగిస్తామని రైతుల వద్ద లక్షలాది రూపాయల ముడుపులు తీసుకొని పనులు చేయకుండా వెళ్లిపోయారు. ఇప్పుడు ఏం చేయాలె పాలుపోక ఆ రైతులు అల్లాడుతున్నారు. అధికారులు చేసిన తప్పిదానికి తాము బలికావాల్సి వచ్చిందని వాపోతున్నారు. అత్యవసరమైన పనులకోసం, ఆర్థిక ఇబ్బందుల కోసం విక్రయించుకునే వీలులేక పడరాని పాట్లు పడుతున్నారు. కనీసం బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు కూడా ఇవ్వటం లేదు.
గతంలో రెవెన్యూ రికార్డుల్లో పట్టాభూములుగా నమోదై ఎన్నోసార్లు క్రయవిక్రయాలు జరిగిన భూములు కూడా 22ఏ లో చేర్చారు. ప్రస్తుతం ఆ భూములను కొనుగోలు చేసిన రైతులు విక్రయించిన వారిపై గొడవలు పడుతున్నారు. తమను మోసంచేసి ప్రభుత్వ భూములు విక్రయించారని ఆరోపిస్తున్నారు. వాస్తవంగా ఆ భూములు రికార్డుల ప్రకారం పట్టాభూములైనప్పటికీ అధికారులు ఉద్దేశపూర్వకంగా అనేక గ్రామాల్లో 22ఏ లో చేర్చారు. పలు గ్రామాల్లో కోర్టుల ద్వారా పట్టాలు పొంది రికార్డులు క్రమబద్ధీకరించుకొని కొందరు సాగు చేసుకుంటున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. అలాంటి భూములను కూడా 22ఏలో చేర్చారు.
దర్శికి చెందిన కొంతమంది రైతుల పట్టాభూములను 22ఏలో చేర్చటమే కాక లంకోజనపల్లి రెవెన్యూలో కలిపారు. ఇక్కడి భూములను అక్కడి 22ఏ జాబితాలో ఎలా కలిపారో అర్థంకాలేదు. ఈ విషయాలను రైతులు గుర్తించి అధికారులు చేసిన తప్పిదాలపై మండిపడుతున్నారు. కొంతమంది రైతులు కోర్టులకు వెళ్లి 22ఏలో చేరిన భూములను పట్టాభూములుగా హక్కుకల్గేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆ భూములను మాత్రం అధికారులు తప్పనిసరి పరిస్ధితుల్లో క్రమబద్ధీకరించారు. మిగిలిన భూముల గురించి పట్టించుకోలేదు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముడుపులు తీసుకున్న అధికారులు ఇప్పుడు బదిలీలపై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అధికారుల చుట్టూ తిరిగినా పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గట్టిగా ఒత్తిడి తెచ్చిన కొంతమంది రైతులకు తిరిగి డబ్బులు ఇచ్చారు. మరికొందరికి నేటికీ ఇంకా డబ్బులు ఇవ్వలేదు. తాము ఆ పనిచేస్తామని ఇంకా మాయమాటలు చెబుతున్నారు. ఏళ్ల తరబడి వేచి చూసిన రైతులు ఇక పనులు జరగవనే ఉద్దేశంతో కొంతమంది కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22ఏలో చేరిన భూములను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించటంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా రైతుల ఇబ్బందులను గుర్తించి రికార్డులు క్రమబద్ధీకరించేలా ఉత్తర్వులు ఇచ్చి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.