PM Modi: శభాష్ లోకేశ్
ABN , Publish Date - Jun 22 , 2025 | 06:11 AM
యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంలో కీలకపాత్ర పోషించిన రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి లోకేశ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.
యోగాంధ్ర సక్సె్సపై మోదీ ప్రశంస
విశాఖపట్నం, జూన్ 21(ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంలో కీలకపాత్ర పోషించిన రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి లోకేశ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ కార్యక్రమం నిర్వహణలో లోకేశ్ చొరవ, పనితీరు గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ వేదికపైనే ఆయనను అభినందించారు. యోగాంధ్ర విజయవంతంలో లోకేశ్ పాత్ర మరువలేనిదన్నారు.ఇలాంటి కార్యక్రమాలను ఏ విధంగా జనంలోకి తీసుకెళ్లగలమో గత నెల, నెలన్నర రోజులుగా ఆయ న చేసి చూపించారని కొనియాడారు. ఆయనను ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కాగా, విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రుల సబ్ కమిటీలో లోకేశ్ కీలక సభ్యుడు. పది రోజుల ముందే విశాఖపట్నం వచ్చి ఆంధ్రా యూనివర్సిటీలోని సాగరిక హాలులో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరును పరిశీలించారు. సమీక్ష నిర్వహించేందుకు ఐదు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వచ్చినప్పుడు కూడా ఆయనతో పాటు వచ్చి సమీక్షలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులకు జన సమీకరణపై పలు సూచనలు చేశారు.