Nishanth Kumar : నిషాంత్కుమార్కు పీఎం అవార్డు
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:31 AM
గతంలో పార్వతీపురం మన్యం కలెక్టర్గా శిశు మరణాల రేటు తగ్గించినందుకు ప్రస్తుత ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్కుమార్కు ప్రధానమంత్రి విశిష్ట పురస్కారం లభించింది. ఈ మేరకు కేంద్ర పరిపాలనా, సంస్కరణల శాఖ నుంచి గురువారం ఆయనకు సమాచారం అందింది. 2022 నుంచి

అమరావతి, ఏలూరుసిటీ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): గతంలో పార్వతీపురం మన్యం కలెక్టర్గా శిశు మరణాల రేటు తగ్గించినందుకు ప్రస్తుత ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్కుమార్కు ప్రధానమంత్రి విశిష్ట పురస్కారం లభించింది. ఈ మేరకు కేంద్ర పరిపాలనా, సంస్కరణల శాఖ నుంచి గురువారం ఆయనకు సమాచారం అందింది. 2022 నుంచి 2024 మధ్య కాలంలో ఆయన పార్వతీపురం మన్యం కలెక్టర్గా పనిచేశారు. మన్యంలో మాతా, శిశు మరణాల రేటు అధికంగా ఉండేది. దీంతో శిశు మరణాల రేటు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రిజమ్ అనే కార్యక్రమాన్ని అమలుచేసింది. దానిని సమర్థవంతంగా అమలుచేయడం ద్వారా మన్యంలో శిశు మరణాల రేటును నిషాంత్కుమార్ 24 నుంచి 8కి తగ్గించారు. అలాగే ప్రసూతి మరణాలను కూడా తగ్గించారు. దీంతో ఆయన్ను అవార్డుకు ఎంపిక చేశారు.
ఏలూరు జిల్లాకు ప్రధాన మంత్రి పురస్కారం
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2023 ఏలూరు జిల్లాకు లభించింది. కేంద్రం నుంచి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పాటైన ఈ జిల్లాకు మొదటి కలెక్టర్గా ప్రసన్నవెంకటేశ్ పనిచేసినసమయంలో జిల్లాలో పౌరసేవలు, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లారు. దీంతో దేశంలో ఉన్న 788 జిల్లాల్లో 16 జిల్లాలను కేంద్రం ఎంపిక చేయగా అందులో ఏలూరు జిల్లాకు స్థానం లభించింది.