Siraj Ur Rehman custody: విచారణలో విస్తుగొల్పే కుట్రకోణాలు
ABN , Publish Date - May 29 , 2025 | 05:51 AM
విజయనగరం సహా పలు రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానించిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్ల 14 రోజుల రిమాండ్ కోర్టు ఆదేశాలతో కొనసాగుతోంది. ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు వారి ఇళ్లలో నుంచి పేలుళ్లకు సంబంధించిన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
ముగిసిన సిరాజ్ రెహ్మాన్, సమీర్ కస్టడీ
కోర్టుకు హాజరు.. విశాఖ జైలుకు తరలింపు
‘అహిం’ సభ్యుల కోసం దేశవ్యాప్తంగా గాలింపు
విజయనగరం/క్రైం, మే 28(ఆంధ్రజ్యోతి): విజయనగరంతో పాటు, పలు రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్ల కస్టడీ బుధవారంతో ముగిసింది. వైద్య పరీక్షల అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో జిల్లా కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయాధికారి ఆదేశాలతో భారీ బందోబస్తు నడుమ విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నెల 16న సిరాజ్ను విజయనగరం విజ్జీ స్టేడియంలో ఏపీ, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సిరాజ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్లో సమీర్ను అదుపులోకి తీసుకుని విజయనగరం తీసుకొచ్చారు. వీరిద్దరినీ విచారించగా పలు విస్తుగొల్పే కుట్రకోణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అదేరోజు ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అధికారులు విజయనగరంలోని పలుప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సిరాజ్ ఇంట్లో పేలుళ్లకు సంబంధించి మందుగుండు సామగ్రి, ల్యాప్టాప్, సెల్ఫోన్లు, సిరాజ్ వినియోగించే బైక్ను స్వాధీనం చేసుకున్నారు. 17వ తేదీన సిరాజ్ను, 18న సమీర్ను కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి ఆదేశాలతో 14 రోజుల రిమాండ్కు తరలించారు. దీంతో ఎన్ఐఏ, పోలీసు అధికారులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణ నిమిత్తం కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. దీంతో 22న పోలీసు కస్టడీకి అనుమతిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు ఇచ్చారు.
ఆరు రోజుల విచారణ ఇలా..
23వ తేదీ నుంచి స్థానిక పోలీసు శిక్షణా కళాశాలలో విచారణ ప్రారంభించారు. ఈ ఆరు రోజుల్లో దర్యాప్తు అధికారులు అనేక కుట్ర కోణాలకు సంబంధించి రుజువులతో ప్రశ్నించారు. మొదటి రెండ్రోజులు ఇద్దరూ నోరు మెదపకుండా.. అధికారులకు సహకరించలేదని తెలిసింది. తర్వాతి రోజు నుంచి గట్టిగా దర్యాప్తు చేయడంతో అనేక కీలక విషయాలను వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
భారత్పై పవిత్ర యుద్ధమే లక్ష్యంగా సిరాజ్.. సిగ్నల్ యాప్, ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అమాయక ముస్లిం యువకులకు రెచ్చగొట్టి తన దారిలోకి తెచ్చుకునేలా పోస్టులు పెట్టేవాడు. వారితో యాప్ల్లో సంభాషించేవాడు. సిరాజ్ అహిం సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో 100 మంది వరకు సభ్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇన్స్టాలో సిరాజ్ క్రియేట్ చేసిన గ్రూపులో వందలాది మందిని తనవైపు తిప్పుకున్నట్లు తెలిసింది. ఒన్ ఉమ్మా్హ-ఒన్ బాడీ- ఒన్ యూనిటీ అనే గ్రూపులో దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవాడు. భారత్ను విచ్ఛిన్నం చేసేందుకు అవసరమైతే మానవ బాంబుగా మారి ప్రాణత్యాగానికైనా సిద్ధం అన్నట్లు రెచ్చగొట్టేవాడని గుర్తించారు.
సిరాజ్ పోస్టులు ఆరబ్ దేశాల్లోని కొంత మందికి నచ్చడంతో పలువురు ఆర్థిక సాయం కూడా చేసినట్లు తెలిసింది.
మొదటి పేలుడు విజయనగరంలోనే చేయాలని, అప్పుడే అహిం సంస్థకు గుర్తింపు వస్తుందని సభ్యులతో సిరాజ్ చెప్పినట్టు సమాచారం.
సిరాజ్ రెండుసార్లు సౌదీ, అరబ్ దేశాలు, పలుమార్లు ఢిల్లీ వెళ్లినట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. సుమారు 20 మంది స్లీపర్ సెల్స్ను తయారు చేసినట్లు సమాచారం.
విజయనగరంలో సిరాజ్తో పరిచయమున్న కొందరు ఇప్పుడు పత్తాలేకుండా పోయారని తెలిసింది. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే వివరాల్ని స్థానిక పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది.
ఒమన్లో నివసిస్తున్న ఇమ్రాన్ అక్రమ్, యూపీకి చెందిన బాదర్, విశాఖలోని విశ్రాంత రెవెన్యూ అధికారి, వరంగల్కు చెందిన ఫర్హాన్ మొహిద్దీన్, ఆడ్నన్ ఖురేషీ, దిశాన్, మోషిన్ షేక్, జస్సీర్ ఆలియాస్ అమన్, పహాద్, అమీర్ ఆన్సారీ తదితర వ్యక్తులతో సిరాజ్కు సంబంధాలు న్నాయి. వారితో ఆర్థిక లావాదేవీలు, కుట్రలకు సంబంధించి కీలక సమాచారాన్ని దర్యాప్తు అధికారులు రాబట్టినట్లు సమాచారం.
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News