Jagan: ఎవరీ ప్రద్యుమ్న..?
ABN , Publish Date - Jun 19 , 2025 | 05:00 AM
జగన్ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం వ్యవహారంలో మరో కొత్తపాత్ర తెరపైకి వచ్చింది. కీలక నిందితుడు, గత ఎన్నికల్లో ఒంగోలు లోక్సభస్థానంలో వైసీపీ అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో ఆయనకున్న లింకేమిటో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజాగా ఆరా తీస్తోంది.
లిక్కర్ స్కామ్లో వెలుగులోకి కొత్త పేరు
ఒంగోలులో ఇన్ఫ్రాం కంపెనీ అధిపతి
విదేశాల్లో ఉన్నట్లు అనుమానం
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం వ్యవహారంలో మరో కొత్తపాత్ర తెరపైకి వచ్చింది. కీలక నిందితుడు, గత ఎన్నికల్లో ఒంగోలు లోక్సభస్థానంలో వైసీపీ అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో ఆయనకున్న లింకేమిటో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజాగా ఆరా తీస్తోంది. ప్రద్యుమ్న చంద్రపాటి ఒంగోలు కేంద్రంగా ఇన్ఫ్రా కంపెనీ నిర్వహిస్తున్నారని తెలియవచ్చింది. గత ఏడాది ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్పోస్టు వద్ద తనిఖీల సందర్భంగా ఓ కారులో రూ.8.37 కోట్లు పట్టుబడ్డాయి. ఈ సొమ్ము చెవిరెడ్డిదని సిట్ తేల్చింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి మద్యం ముడుపుల ద్వారా తీసుకున్న సొమ్మును.. హైదరాబాద్లో ఉంటున్న చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేశ్నాయుడి ద్వారా ఎన్నికల్లో పంచేందుకు చెవిరెడ్డి కోసం పంపినట్లు ఆధారాలు సేకరించింది. అయితే ఆ సొమ్ము తనదంటూ ఒంగోలుకు చెందిన ప్రద్యుమ్న అప్పట్లో కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలియడంతో సిట్ ఆయనపై దృష్టి సారించింది. ఆయన నిర్మాణ రంగం(ఈష్ణా ఇన్ ఫ్రా)లో ఉంటూ కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించినట్లు వెల్లడైంది. హైదరాబాద్ కేంద్రంగా ఓ చానల్కు డైరెక్టర్గానూ పనిచేశారు. ఆయన విదేశాలకు చెక్కేశారని అనుమానిస్తున్నారు.