Nellore Quartz Scam: బయటకు రానున్న నిజాలు.. వారి గుండెల్లో గుబులే
ABN , Publish Date - Apr 11 , 2025 | 10:03 AM
Nellore Quartz Scam: నెల్లూరు క్వార్ట్జ్ కుంభకోణానికి సంబంధించి మైన్స్ యజమానుల ఫిర్యాదు మేరకు సీబీఐ, ఈడీ, లోకాయుక్త రంగంలోకి దిగాయి.

నెల్లూరు, ఏప్రిల్ 11: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జగన్ ప్రభుత్వ హయాంలో భారీ క్వార్ట్జ్ కుంభకోణం (Nellore Quartz Scam) జరిగింది. దాదాపు రూ.10వేల కోట్లకు పైగా స్వాహా చేసేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మైన్ యజమాని ఆదూరు బద్రీనాథ్ క్వార్ట్జ్ కుంభకోణంపై సీబీఐ, ఈడీ, లోకాయుక్తకు ఫిర్యాదులు చేశారు. దీంతో ప్రభుత్వ, అటవీ, దేవాదాయ శాఖ భూముల్లో అక్రమ తవ్వకాలు, భారీ బ్లాస్టింగులు, విదేశాలకు ఎగుమతులు, రూ.వేల కోట్ల నగదు లావాదేవీలు, ఫోన్ కాల్స్పై సీబీఐ, ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు. లోకాయుక్త బృందం రెండు రోజులు కిందట నేరుగా విచారణ జరిపింది.
క్వార్ట్జ్ కుంభకోణంలో వైసీపీ పెద్దలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలు ఉన్నారు. సీబీఐ, ఈడీ, లోకాయుక్త ఎంట్రీతో అక్రమార్కుల గుండెల్లో గుబులు నెలకొంది. కాగా.. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే సీఐడీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. మైన్స్ యజమానుల ఫిర్యాదుల మేరకు సీఐడీ అధికారులు ముమ్మరంగా విచారణ చేపట్టారు. ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం.
అయితే.. క్వార్ట్జ్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే నోటీసులు ఇచ్చిన విచారణకు రావాల్సిందిగా పోలీసులు చెప్పినప్పటికీ కాకాణి మాత్రం తప్పించుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే మూడు సార్లు కాకాణికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. మూడు సార్లు కూడా వ్యక్తిగతంగా కలిసి నోటీసులు ఇవ్వాలని భావించినప్పటికీ మాజీ మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఆయన బంధువులకు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ కాకాణి మాత్రం ప్రతీసారి డుమ్మా కొడుతూనే ఉన్నారు. అంతే కాకుండా ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి. ఈ కేసును క్వాష్ చేయాలంటూ పిటిషన్ వేశారు. కానీ హైకోర్టులో కూడా కాకాణికి గట్టి షాకే తగిలింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్తానం నిరాకరించడంతో పాటు క్వాష్ పిటిషన్పై రెండు నెలల తర్వాత విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. అలాగే పోలీసుల విచారణకు సహకరించాలని తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాల అనంతరం కాకాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే.. కాకాణి విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు.
కాగా.. గత ప్రభుత్వ హయాంలో కాకాణి సొంత గ్రామం తోడేరుకు అతి సమీపంలోని వరదాయపాలెం గ్రామంలో అక్రమ మైనింగ్ జరిగింది. అప్పటి మంత్రిగా ఉన్న కాకాణి కనుసన్నల్లోనే ఈ మైనింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ దాదాపు 30 ఏళ్లుగా మైనింగ్ నిర్వహిస్తున్న రుసుం మైన్స్ను బెదిరించి వారిని అక్కడి నుంచి తరిమేసి.. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున క్వార్ట్జ్ అక్రమాలకు పాల్పడ్డారు. మైనింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాకాణితో సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిందని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
Gold Price: భగ్గుమన్న పసిడి ధర ఔన్స్ 3,183 డాలర్లు
Shock: చాలా రోజులు ఖాళీగా ఇల్లు.. డోర్ ఓపెన్ చేయగా షాక్..
Read Latest AP News And Telugu News