ఎంఆర్ కంపెనీ గుర్తింపును రద్దు చేయాలి
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:06 AM
జయరాజ్ ఇస్పాత స్టీల్ ప్లాంటు (ఉక్కు) పరిశ్రమలో ఉన్న ఎంఆర్ కంపెనీ కాంట్రాక్టు తీసుకుని పనులు చేయిస్తుందని, వెంటనే ఎంఆర్ కంపెనీ కాంట్రాక్టు గుర్తింపును రద్దు చేయాలని సీపీఐ మండల సహాయ కార్యదర్శి సుధాకర్, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్, ప్రగతిశీల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయ్యన్న డిమాండ్ చేశారు.

ఓర్వకల్లు జనవరి 16, (ఆంధ్రజ్యోతి): జయరాజ్ ఇస్పాత స్టీల్ ప్లాంటు (ఉక్కు) పరిశ్రమలో ఉన్న ఎంఆర్ కంపెనీ కాంట్రాక్టు తీసుకుని పనులు చేయిస్తుందని, వెంటనే ఎంఆర్ కంపెనీ కాంట్రాక్టు గుర్తింపును రద్దు చేయాలని సీపీఐ మండల సహాయ కార్యదర్శి సుధాకర్, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్, ప్రగతిశీల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయ్యన్న డిమాండ్ చేశారు. గురువారం గుట్టపాడు సమీపాన వున్న జయరాజ్ ఇస్పాత పరిశ్రమ ఎదురుగా కార్మికులు, నాయకులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. స్టీల్ ప్లాంటులో ఎంఆర్ కంపెనీలో పని చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా, ఇష్టానుసారంగా పనులు చేయిస్తున్నారని నాయకులు ఆరోపించారు. ఎస్ఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్మికుల ధర్నాతో ఎట్టకేలకు యాజమాన్యం దిగి వచ్చింది. కార్మికులతో తమ ఇంట్లో చర్చలు జరుపుతామని కంపెనీ యజమాని చెప్పిన మాటను కార్మికులు తిరస్కరించారు. ధర్నా శిబిరం వద్దనే కార్మికులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. దీంతో యజమాన్యం ధర్నా వద్దకు వచ్చి కార్మికులతో చర్చించి హామీలు ఇచ్చింది. దీంతో కార్మికులు ధర్నాను విరమించుకున్నారు. ఈ సందర్బంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ మండలంలో పరిశ్రమలు వస్తున్నా.. స్థానికులకు మాత్రం ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదన్నారు. జయరాజ్ ఇస్పాతలో పని చేస్తున్న ఎంఆర్ కంపెనీలో కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. స్థానిక యువత వంద మందికి పైగా ఉద్యోగాలు చేస్తున్నా సక్రమంగా జీతభత్యాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.