Gorantla Madhav: సహకరించని మాధవ్
ABN , Publish Date - Apr 24 , 2025 | 05:19 AM
వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను చేబ్రోలు కిరణ్కుమార్పై దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను గుంటూరు తరలించి వైద్య పరీక్షలు అనంతరం నల్లపాడు పోలీసు స్టేషన్కు తరలించారు, అయితే ఆయనకు సహకరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చేబ్రోలు కిరణ్ సమాచారం ఇచ్చింది ఎవరని అడిగిన డీఎస్పీ బృందం
తెలియదంటూ దాటవేసిన మాజీ ఎంపీ
గుంటూరు/రాజమహేంద్రవరం, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్కుమార్పై దాడికి ప్రయత్నించి దౌర్జన్యం చేసిన కేసులో నిందితుడైన వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు నగరంపాలెం పోలీసులు బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం గుంటూరుకు తరలించి జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం సాయంత్రం నల్లపాడు పోలీసు స్టేషన్కు తరలించారు. గుంటూరు వెస్ట్ డీఎస్పీ అరవింద్, నగరంపాలెం సీఐ నజీర్ తదితరులు ఆయన్ను ప్రశ్నించారు. అనంతపురం జిల్లాకు చెందిన మాధవ్కు.. కిరణ్కుమార్ మంగళగిరి పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం ఇచ్చింది ఎవరు.. దాడికి పురిగొల్పింది ఎవరు.. సహకరించింది ఎవరు.. వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరన్న ప్రశ్నలకు మాధవ్ సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. దీంతో గురువారం పూర్తిస్థాయిలో విచారించాలని అధికారులు నిర్ణయించారు.
పోలీసులు నిబంధనల ప్రకారం మాధవ్ను లాక్పలో ఉంచారు. సరిగా గాలి ఆడడం లేదంటూ ఆయన తన వంటిపై ఉన్న దుస్తులు విప్పి కట్డ్రాయర్పై కూర్చున్నట్లు తెలిసింది. అలా కూర్చోవడం సరికాదని, దుస్తులు ధరించాలని పోలీసులు సూచించినా.. గాలి ఆడకపోతే ఏం చేయమంటారంటూ ఆయన పోలీసు భాషలో మాట్లాడారు. వాస్తవానికి బుధవారం ఉదయానికే ఆయన్ను గుంటూరు తీసుకురావలసి ఉన్నప్పటికీ ఆలస్యం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధ, గురువారాల్లో రెండ్రోజులు ఆయన్ను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు గత సోమవారం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఓ సీఐ ఆధ్వర్యంలో 30 మంది గుంటూరు పోలీసులు బుధవారం ఉదయం 10.30 సమయంలో జైలుకు వచ్చి.. ఆయన్ను కస్టడీకి తీసుకునేప్పటికి మధ్యాహ్నమైంది. మధ్యాహ్నం 12.30కు ఎస్కార్టు మినీ బస్సులో మాధవ్తో తిరిగి బయల్దేరారు. అయితే గుంటూరు చేరేసరికి సాయంత్రం దాటింది. వైద్య పరీక్షలు నిర్వహించి పోలీసు స్టేషన్కు తీసుకెళ్లేటప్పటికి రాత్రి అయింది. దీంతో తొలిరోజు పెద్దగా సమయం లేకపోయింది. ఆలస్యం చేసి ఆయనకు సహకరించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..