MLA Dhulipalla Narendra: ఆత్మహత్యకు కారణం మీరే.. విగ్రహం పెట్టేదీ మీరే
ABN , Publish Date - Jun 18 , 2025 | 05:41 AM
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ యోగా డే నిర్వహించుకునే సమయంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు జగన్ స్కెచ్ వేశారని, అందులో భాగమే సత్తెనపల్లి పర్యటన అని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు.

శాంతిభద్రతల విఘాతానికి జగన్ స్కెచ్: ఎమ్మెల్యే ధూళిపాళ్ల
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ యోగా డే నిర్వహించుకునే సమయంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు జగన్ స్కెచ్ వేశారని, అందులో భాగమే సత్తెనపల్లి పర్యటన అని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు జగన్రెడ్డే కారణమని అన్నారు. గత ఎన్నికల సమయంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి అబద్ధాలను ప్రచారం చేయించి, వైసీపీపై పెద్దఎత్తున బెట్టింగ్లు పెట్టేలా చేశారని పేర్కొన్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాలు నమ్మి.. బెట్టింగ్ పెట్టిన నాగమల్లేశ్వరరావు ఆ డబ్బులు కట్టలేక 2024 జూన్ 9న ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అప్పటికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాలేదని, నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు కారణమైన జగన్.. ఇప్పుడు ఏడాది తర్వాత విగ్రహం పెట్టించి శవ రాజకీయాలు చేస్తున్నారని, ఆయన నటనకు ఆస్కార్ ఇవ్వొచ్చని విమర్శించారు. సత్తెనపల్లి పర్యటనపై తమకు అభ్యంతరం లేదని, అయితే ప్రత్యేక కుట్రకోణంలోనే పర్యటనలు పెట్టుకుంటున్నారని, సత్తెనపల్లి పర్యటన కూడా అందులో భాగమేనన్నారు. ప్రజాసమస్యల పేరుతో జగన్ చేస్తున్న హింసా రాజకీయాలు, కుట్ర ఆలోచనలను ప్రజలు గమనించాలని కోరారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా ఆయన వైఖరిలో మార్పు రాలేదన్నారు.