Cordelia Cruises: విశాఖకు మళ్లీ క్రూయిజర్
ABN , Publish Date - Feb 13 , 2025 | 04:38 AM
ఈ ఏడాది జూన్ 30 నుంచి జూలై 19వ తేదీ మధ్యలో మూడు ట్రిప్పులు నడుపుతామని ప్రకటించింది. మూడేళ్ల క్రితం అంటే 2022 జూన్లో ఇదే సంస్థ ఇప్పుడు ప్రకటించిన మార్గంలోనే ‘ఎంప్రెస్ క్రూయిజ్ నౌక’ ను నడిపింది.

జూన్-జూలైలో మూడు ట్రిప్పులు
వెల్లడించిన కార్డెలియా సంస్థ
విశాఖపట్నం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): భారతదేశంలో పర్యాటకుల కోసం క్రూయిజ్లను నడిపే కార్డెలియా సంస్థ చెన్నై-విశాఖపట్నం-పాండిచ్చేరి-చెన్నైల మధ్య మరోసారి క్రూయిజ్ నడపడానికి ముందుకొచ్చింది. ఈ ఏడాది జూన్ 30 నుంచి జూలై 19వ తేదీ మధ్యలో మూడు ట్రిప్పులు నడుపుతామని ప్రకటించింది. మూడేళ్ల క్రితం అంటే 2022 జూన్లో ఇదే సంస్థ ఇప్పుడు ప్రకటించిన మార్గంలోనే ‘ఎంప్రెస్ క్రూయిజ్ నౌక’ ను నడిపింది. అప్పుడు ఒక్కో ట్రిప్పులో 1,200 మంది వరకు ప్రయాణించారు. అప్పటికి విశాఖపట్నం పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ పూర్తికాకపోవడంతో ఆ పక్కనే ఉన్న అదానీ బెర్తు వద్ద పర్యాటకులు దిగే ఏర్పాట్లు చేశారు. ఆ నౌక సామర్థ్యం 2,100 మంది కాగా 85 శాతం ఆక్యుపెన్సీతో నడిచింది. మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు పోర్టులో అధునాతన టెర్మినల్ అందుబాటులో ఉన్నందున క్రూయిజ్ను నడపాలని కార్డెలియో ప్రతినిధులను ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధ్యక్షుడు విజయమోహన్ కోరగా... మూడు ట్రిప్పులు నడపడానికి అంగీకరించింది. క్రూయిజ్ నౌక జూన్ 30న చెన్నైలో బయలుదేరి జూలై 2న విశాఖపట్నం వస్తుంది. అదేరోజు తిరిగి ఇక్కడ నుంచి బయలుదేరి 4వ తేదీన పుదుచ్చేరి చేరుతుంది. అదేరోజు అక్కడి నుంచి బయలుదేరి 5వ తేదీన చెన్నై వెళుతుంది. దీంతో ఒక ట్రిప్పు పూర్తవుతుంది. ఆ తరువాత జూలై 7వ తేదీన మరో ట్రిప్పు ప్రారంభమై అదే మార్గంలో 12వ తేదీన చెన్నైలో ముగుస్తుంది. మూడో ట్రిప్పు జూలై 14న చెన్నైలో మొదలై తిరిగి 19వ తేదీన ముగుస్తుంది. ఒక్కో ట్రిప్పులో చెన్నైలో ఎక్కి తిరిగి చెన్నైలో దిగితే క్రూయిజ్ ఐదు రాత్రులు సముద్రంలో ఉంటుంది.
అప్పుడు టికెట్ ధర రాత్రికి రూ.9,300
క్రూయిజ్ను మూడేళ్ల క్రితం నడిపినప్పుడు ఇదే సంస్థ ఒక రాత్రి ప్రయాణానికి పెద్దలకు రూ.9,300 చొప్పున విశాఖ నుంచి చెన్నై వెళ్లడానికి మూడు రాత్రులకు గాను రూ.27,900 తీసుకుంది. అయితే చెన్నై నుంచి విశాఖపట్నం వచ్చినవారు రెండు రాత్రులకు రూ.18,600 చెల్లించారు. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఒక రాత్రికి రూ.8 వేలు వసూలు చేశారు. ఆ తర్వాత ఒక రాత్రికి రూ.13 వేల వరకు పెంచారు. క్రూయిజ్లో అల్పాహారం, భోజనం ఉచితం. మద్యం, వై-ఫైలకు అదనపు చార్జీలు వసూలు చేస్తారు.
ఇంకా ధరలు నిర్ణయించాల్సి ఉంది
కార్డెలియో సంస్థ చెన్నై నుంచి విశాఖపట్నం-పుదుచ్చేరి మీదుగా మరోసారి చెన్నైకి క్రూయిజ్ నడపడానికి షెడ్యూల్ ప్రకటించింది. అయితే టికెట్ రేట్లను ఇంకా ఇవ్వలేదు. త్వరలోనే ఖరారు చేసే అవకాశం ఉంది. ఎక్కువ మంది ప్రయాణించేలా కాస్త తక్కువ రేట్లు పెట్టాలని సూచించాం.
- కె.విజయమోహన్, అధ్యక్షుడు,
ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News