Yuvagalam: అరాచక పాలనపై యువగళం అక్షర రూపం
ABN , Publish Date - May 29 , 2025 | 05:05 AM
వైసీపీ పాలనపై గళమెత్తిన యువగళం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని లోకేశ్ మహానాడు వేదికపై చంద్రబాబుకు అందించారు. లోకేశ్కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్లు పార్టీ సీనియర్లలో ఊపందుకున్నాయి.
చంద్రబాబుకు పుస్తకాన్ని అందించిన మంత్రి లోకేశ్
కడప, మే 28 (ఆంధ్రజ్యోతి): జగన్మోహన్రెడ్డి అరాచక పాలనపై గళమెత్తుతూ చేపట్టిన యువగళం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ రెండోరోజు బుధవారం మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. జగన్ అరాచకాలను ఎలుగెత్తుతూ 2023 జనవరి 27న లోకేశ్ కుప్పం శ్రీవరదరాజస్వామి పాదాల చెంత నుంచి ప్రారంభించిన పాదయాత్ర 226 రోజులు సాగింది. ఇది రాష్ట్ట్ర రాజకీయాల్లో మలుపు తిప్పింది. ఉమ్మడి 13 జిల్లాల్లో 97 నియోజకవర్గాలు, 232 మున్సిపాలిటీలు, కార్పొరేషన్, మండలాలు 2097 గ్రామాల్లో 3132 కి.మీ. మేర పాదయాత్ర సాగింది. పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా సృష్టించిన అడ్డంకులు నాటి అరాచక పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, కన్నీటి గాథలను పుస్తకంలో సచిత్రంగా కళ్లకు గట్టినట్లు చూపారు. సీఎం ఆసక్తిగా తిలకించి లోకేశ్ను అభినందించారు. యువగళం ద్వారా రాష్ట్ర ప్రజల్లో చైతన్యం నింపారని, నాటి అనుభవం పుస్తకాల రూపంలోకి తీసుకురావడం బాగుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా లోకేశ్.. చంద్రబాబుకు పాదాభివందనం చేశారు.
లోకేశ్కు కీలక పదవి ఇవ్వండి
లోకేశ్కు కీలక బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. బుధవారం మహానాడు వేదికపై నుంచే పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వాలని తమ ప్రసంగాల్లో కోరారు. వీరిలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఎంఎస్ రాజు తదితరులు ఉన్నారు.
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News