AP Liquor Scam: రంగంలోకి ఈడీ
ABN , Publish Date - May 28 , 2025 | 04:53 AM
ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం విచారణ కీలక దశకు చేరింది. ముడుపులు ఎవరికి చేరాయో తెలుసుకునేందుకు ఎస్ఐటీ, ఈడీ కలిసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి.
మద్యం స్కామ్లో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ
బెజవాడలో సిట్ అధికారులతో సుదీర్ఘంగా భేటీ
పరస్పరం సహకరించుకునేందుకు అంగీకారం
ఉమ్మడిగా దర్యాప్తు చేయాలని నిర్ణయం
స్కామ్లో ‘అంతిమ లబ్ధ్దిదారు’ కోసం వేట
నేడు జైలులో కసిరెడ్డిని ప్రశ్నించనున్న ఈడీ
సిట్ సహకారంతో ప్రశ్నావళి సిద్ధం
‘ముడుపుల’ సంగతి తేల్చే దిశగా ముందడుగు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో విచారణ కీలక దశకు చేరుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుల అరెస్టులు, విచారణ చేయగా.. ముడుపులు ఎక్కడికి చేరాయి? ‘అంతిమ లబ్ధిదారు’ ఎవరు? అనేది పక్కా ఆధారాలతో సహా తేల్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. ఈ కేసు విచారణలో పరస్పరం సహకారం అందించుకోవాలని సిట్, ఈడీ నిర్ణయించాయి. 3,500 కోట్ల రూపాయల స్కామ్లో పేద ప్రజల నుంచి పిండుకుని దాచుకున్న అసలు దొంగకు ఉమ్మడిగా ఉచ్చు బిగించేందుకు సిద్ధమవుతున్నాయి. మంగళవారం విజయవాడలోని ‘సిట్’ కార్యాలయంలో ఈ దిశ గా కీలక ముందడుగు పడింది. సిట్ బృందం తో ఈడీ అధికారులు భేటీ అయ్యారు. ఈ కుంభకోణంలో ఆర్థిక లావాదేవీలు, అక్రమాలు జరిగిన తీరుపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. ముడుపులు సేకరించిన తీరు మొదలుకొని వాటిని మళ్లించిన దారుల వరకు సిట్ అధికారులు ఈడీకి వివరించారు. డిస్టిలరీస్ నుంచి తీసుకున్న కమీషన్లు ఏ రూపంలో ఎంత? ఏ కంపెనీ ఎవరెవరికి ఎంత చేర్చింది? అనే వివరాలు అందించారు. ప్రమోషనల్ గూడ్స్ రూపంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీలోని హవాలా ఆపరేటర్ల ద్వారా మనీలాండరింగ్ జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల అధికారులు ఉమ్మడి దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఇటీవల ముంబైలో సిట్ అధికారులకు ఈడీ అధికారులు సహకరించారు. అలాగే ముడుపులు చేరిన మార్గం, అంతిమ లబ్ధిదారుడి గుట్టు రట్టు చేసేందుకు ఇప్పుడు సహకరించనున్నారు. మొత్తం కుంభకోణం ఎలా జరిగిందనే దానిపై సిట్ ప్రత్యేక నోట్ సిద్ధం చేసింది. ఈ వివరాలను ఈడీ అధికారులతో పంచుకుంది. రియల్ ఎస్టేట్ లింకులతో పాటు బినామీల ద్వారా బెంగళూరులో కొనుగోలుచేసిన భారీ ఆస్తుల వివరాలతో కూడిన ఐదు లేయర్ల డేటాను ఈడీకి అందజేసింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ సిట్, ఈడీ అధికారులు చర్చించారు.
నేడు ఈడీ విచారణ
మద్యం స్కామ్లో కింగ్పిన్గా భావిస్తున్న ఏ-1 రాజ్ కసిరెడ్డితో పాటు ఇతర నిందితులు, మద్యం వ్యాపారులు, మాజీ అధికారులు సిట్కు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ముడుపులు అంతిమంగా ఎవరికి చేరాయో తేలిపోయింది. అయితే ఇందుకు పక్కా ఆధారాలు సేకరించాల్సి ఉంది. రాజ్ కసిరెడ్డి ఏర్పాటు చేసుకున్న క్యాష్ హ్యాండర్లు సేకరించిన ముడుపులు ఎన్ని దశలు దాటి ఎవరికి చేరాయనే విషయం ఇటీవల అరెస్టు చేసిన ముగ్గురు కీలక వ్యక్తుల విచారణలో తేలింది. తాడేపల్లి ప్యాలె్సలో ఐదేళ్ల పాటు తిరుగులేని హవా నడిపించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎ్సడీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను సిట్ విచారించింది. సిట్ సేకరించిన వివరాల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. ‘అంతిమ లబ్ధిదారుడి’ వేటలో భాగంగా రాజ్ కసిరెడ్డిని బుధవారం విజయవాడ జైలులో ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రశ్నావళి సిద్ధం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో కింగ్ పిన్ ఇచ్చే సమాచారం కీలకం కానుంది.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News