విద్యార్థులతో వైసీపీ రాజకీయం
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:03 PM
వైసీపీ నాయకులు తమ స్వార్థం కోసం విద్యార్థులతో రాజకీయాలు చేస్తున్నారు. వైద్య కళాశాల ముట్టడికి ఐదు నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దగా రాలేదు.
అంతంత మాత్రమేగానే మెడికల్ కాలేజీ ముట్టడి
కార్యకర్తలు నిల్.. విద్యార్థులు ఫుల్
ఆదోని రూరల్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులు తమ స్వార్థం కోసం విద్యార్థులతో రాజకీయాలు చేస్తున్నారు. వైద్య కళాశాల ముట్టడికి ఐదు నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దగా రాలేదు. దీంతో విద్యార్థులపై ఆధారపడ్డారు. వైసీపీ ఆధ్వర్యంలో పీపీపీ పద్ధతిని వ్యతిరేకిస్తూ శుక్రవారం ఆరేకల్లు సమీపంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు నుంచి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వైసీపీ నాయకుల రాజకీయ ఆలోచనలతో పీపీపీ విధానాన్ని సాకు చూపుతూవిద్యార్థులతో వైసీపీ జెండాలు, వైసీపీ జగన్ ప్లకార్డులు ప్రదర్శించారు. వారితో జై జగన్ అంటూ నినాదాలు చేయించారు. పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమం చేస్తూనే ఉంటామని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వానికి మెడికల్ కళాశాలను పీపీపీ ద్వారా నిర్వహించాలని ఆలోచన రావడమే దూరదృష్టకరమని మాజీ ఎంపీ బుట్టా రేణుక పేర్కొన్నారు. అసెంబ్లీలో మీకు మీరు సోదులు చెప్పుకుంటూ, కాలక్షేపం చేస్తున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి విమర్శించారు.