పెళ్లి బృందంపై వైసీపీ శ్రేణుల దాడి
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:01 AM
వివాహం అనంతరం ఊరేగింపు నిర్వహిస్తున్న పెళ్లి బృందంపై వైసీపీ నాయకులు దాడి చేసిన సంఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలం 3వ వార్డులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
కోసిగిలో ఘటన, పలువురికి గాయాలు
11 మంది వైసీపీ వర్గీయులపై కేసు నమోదు
కోసిగి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): వివాహం అనంతరం ఊరేగింపు నిర్వహిస్తున్న పెళ్లి బృందంపై వైసీపీ నాయకులు దాడి చేసిన సంఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలం 3వ వార్డులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోసిగిలోని మూడో వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు పోతుల తాయన్న కుమారుడి వివాహం అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీకి సంబంధించిన పాటలు పెట్టారంటూ ఆ కాలనీలోని వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా ఆ పెళ్లి బృందంపై దాడి చేసి గాయపరిచారు. దీంతో బాధితులు పోతుల నరసమ్మ, పోతుల తాయన్న, పోతుల నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీకి చెందిన పెండేకంటి లోకారెడ్డి, రాజశేఖర్, గోవిందు, శ్రీరాములుతో పాటు మరి కొంత మంది తమపై దాడి చేసి గాయపరిచారని, మహిళల మెడల్లోని మంగళసూత్రాలు, బంగారు చైన్లు లాగేసుకున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హనుమంతరెడ్డి తెలిపారు.