విచారించి న్యాయం చేస్తాం
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:49 PM
నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ప్రతి సమస్యను చట్ట పరిఽధిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు.
ఎస్పీ సునీల్ షెరాన్
పీజీఆర్ఎస్కు 75 ఫిర్యాదులు
నంద్యాల టౌన్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ప్రతి సమస్యను చట్ట పరిఽధిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు. సోమవారం బొమ్మలసత్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా నలమూలల నుంచి 75 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వీటిని నిర్లక్ష్యం చేయకుండా న్యాయం చేయాలని అధికారులు ఆదేశించారు. ఆలస్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వీటిలో కొన్ని ఫిర్యాదులు ఇలా ఉన్నాయన్నారు.
నంద్యాల పట్టణానికి చెందిన ఒక ప్రైవేటే జూనియర్ కళాశాలలో ఏడాదిగా పని చేస్తున్నా ఇంత వరకు జీతం ఇవ్వలేదని మల్లికార్జునయ్య అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
నంద్యాలలో ఏఎన్ఎంగా పని చేస్తున్న ఒక మహిళ తన భర్త తన చేత పలు బ్యాంకు లోన్లకు సుమారుగా రూ.30 లక్షల వరకు సంతకాలు తీసుకు న్నారని, దీంతో జీతం నుంచి నెల నెల రూ.28వేలు కట్ అవుతున్నదని, అయితే అతను వేరే అమ్మాయితో ఉంటున్నాడని, తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.
బండిఆత్మకూరు చెందిన శ్రీనివాసులు తన స్థలంలో గడ్డివాము, బర్రెల కొట్టం వేసి స్థలం అక్రమించుకున్నారని ఫిర్యాదు చేశారు.
నంద్యాల సాదిక్ నగర్కు చెందిన బాదుల్లా అనే వృద్ధుడు తన పెద్ద కొడుకు, కోడలు కలిసి తన భార్యకు సంబంధించిన 5 తులాల బంగా రును తీసుకుని ఇబ్బందులుకు గురి చేస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
వీటిపై న్యాయ పరిధిలో విచారణ జరిపి వెంటనే పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ మల్లికార్జున గుప్తా, సీఐ గౌతమి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.