ఫిర్యాదులన్నింటినీ త్వరగా విచారిస్తాం
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:40 AM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం త్వరగా విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం త్వరగా విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని టూటౌన్ పోలీస్స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 85 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుశేన్ పీరా, సీఐలు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
పీఎం కిసాన్ పేరుతో ఏపీకే ఫైల్ తన మొబైల్కు రావడంతో తెలియక నేను క్లిక్ చేశానని, పైగా తన ఫోన్లో ఉన్న గ్రూపుల్లోకి కూడా తన ప్రమేయం లేకుండానే ఏపీకే ఫైల్ వెళ్లిందని తెలిపారు. తర్వాత నా ఎస్బీఐ ఖాతా నుంచి రూ.1.96 లక్షలు పోయానీ న్యాయం చేయాలని కల్లూరు మండలం చెందిన ఓ బాధితుడు ఫిర్యాదు చేశారు. కర్నూలులోని ఏదో ఒక స్కూల్లో బయాలజీ టీచర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కర్నూలుకు చెందిన లక్ష్మయ్య రూ.6 లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు తిలక్నగర్కు చెందిన యువరాజు ఫిర్యాదు చేశారు.
బెంగళూరు ఆరిజనో ఇన్ఫో టెక్నాలజీ సాఫ్ట్వేర్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అనంతపురం చెందిన బాబు తమకు శిక్షణ ఇప్పించి ప్రాజెక్టు వర్కు పేరుతో రూ2.లక్షలు తీసుకొని మోసం చేశారని కర్నూలు ముజఫర్నగర్కు చెందిన అభిలాష్ ఫిర్యాదు చేశారు. వర్క్ ఫ్రమ్ హోం పేరుతో 6 నెలల పాటు పని చేయించుకుని ఒక నెల మాత్రమే జీతం డబ్బులు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వడ్డెగేరికి చెందిన ఖాజా ఖాన్ ఇన్స్టాగ్రామ్లో తన భర్త పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి ప్రముఖులను దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని కర్నూలుకు చెందిన ఫసియా ఫిర్యాదు చేశారు.
1.20 ఎకరాల తన పొలాన్ని జిల్లా సర్వేయర్ కొలతలు వేసినా కూడా ఉగాది జయన్న దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడని కర్నూలు ప్యాలకుర్తికి చెందిన పెరుగు నగేష్ ఫిర్యాదు చేశారు. నంద్యాల ఆటోనగర్కు చెందిన కురువ ఈరన్న ధరణి ఆటో గ్యారేజీలో పని చేస్తూ తమ ట్రాక్టర్ ఇంజిన్కు నెలకు రూ.20వేలు బాడుగకు ఇస్తానని తీసుకెళ్లి 8 నెలలు అయిందని, ట్రాక్టర్తో పాటు ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియడం లేదని ఆదోని ఇస్వి గ్రామానికి చెందిన రామాంజనేయులు, మల్లప్ప ఫిర్యాదు చేశారు. నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించి, దొంగ రిజిస్ట్రేషన్తో ఆస్తి మొత్తాన్ని కాజేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు కుమ్మరి వీధికి చెందిన రాకేష్ ఫిర్యాదు చేశారు.