న్యాయం చేస్తాం
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:30 PM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 108 ఫిర్యాదులు
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని టూటౌన్ పోలీ్సస్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 108 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
గవర్నమెంటు టీచర్ ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి కాంట్రాక్టు బేసిస్ కింద మున్సిపాలిటీలో గానీ, కోర్టులో గానీ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.50వేలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు వన్టౌన్కు చెందిన యుగంధర్ ఫిర్యాదు చేశారు.
తన చిన్న కుమారుడు ఇర్ఫాన్ బాషా గత కొద్ది రోజులుగా కనిపించకుండా వెళ్లిపోయాడని కర్నూలు గడ్డావీధికి చెందిన ఖమరున్నీసా ఫిర్యాదు చేశారు.
తన మొబైల్కు పీఎం కిసాన్ పేరుతో ఒక నకిలీ లింక్ వచ్చిందని, ఆ విషయం తెలియకుండా ఓపెన్ చేయడంతో బజాజ్ కార్డు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కొక్కటి రూ.35వేలు విలువగల 3 సెల్ఫోన్లు కొని, తన డబ్బులు కట్ అయ్యేలా చేశారని కర్నూలు నిడ్జూరు గ్రామానికి చెందిన శివశంకర్ ఫిర్యాదు చేశారు.
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి భాస్కర్ అనే వ్యక్తి రూ.1.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు బుధవారపేటకు చెందిన రోజారాణి ఫిర్యాదు చేశారు.
తన భర్త శాంతిరాజు రూ.20లక్షలు వరకు ప్రైవేటు సంస్థలో తన పేరు మీద రుణాలు తీసుకున్నాడని, ఏడాది నుంచి తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని కర్నూలు అశోక్నగర్ చెందిన మనోరంజని ఫిర్యాదు చేశారు.
ఆస్తులు పంచుకుని కుమారులు, కోడళ్లు గెంటేశారని క్రిష్ణగిరి మండలం అమకతాడు గ్రామానికి చెందిన రామలక్ష్మమ్మ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు శివశంకర్, రామకృష్ణ, విజయలక్ష్మి ఉన్నారు.