సమన్వయంతో ముందుకు సాగాలి
ABN , Publish Date - Oct 11 , 2025 | 10:43 PM
ప్రధాని పర్యటనను మన కుటుంబంలో జరుగుతున్న ఓ కార్యక్రమంగా భావించి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రులు బీసీ జనార్దన్రెడ్డి, టీజీ భరత్ అన్నారు.
ప్రధాని పర్యటనను విజయంతం చేయాలి
మంత్రులు బీసీ జనార్దన్రెడ్డి, టీజీ భరత్
250 సీసీ కెమెరాలు ఏర్పాటు
ప్రధానమంత్రి ప్రోగ్రాం స్పెషలాఫీసర్ వీరపాండియన్
సభ పరిసరాల్లో పరిశుభత్రపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ ఏ.సిరి
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు : ఎస్పీ విక్రాంత్
కర్నూలు అర్బన్ / ఓర్వకల్లు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రధాని పర్యటనను మన కుటుంబంలో జరుగుతున్న ఓ కార్యక్రమంగా భావించి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రులు బీసీ జనార్దన్రెడ్డి, టీజీ భరత్ అన్నారు. ఈ నెల 16నఉమ్మడి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. మండలంలోని నన్నూరు టోల్ ప్లాజా సమీపంలోని కంట్రోల్ రూమ్లో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రులు బీసీ, టీజీ, ప్రధానమంత్రి ప్రోగ్రామ్ స్పెషల్ ఆపీసర్, సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండియన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఐఏఎస్, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. మంత్రి బీసీ జనార్దన్రెడ్డి మాట్లాడుతూ రాబోయే మూడు, నాలుగు రోజులు కష్టపడి పనిచేస్తేనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలమన్నారు. సభాప్రాంగణంలో పార్కింగ్ వద్ద 1, 2 ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. భోజనం పంపిణీలో సమస్యలు తలెత్తకుండా నిర్దేశిత ప్రాంతాల్లో భోజనం ఏర్పాట్లు చేయడం ద్వారా ప్రణాళికబద్దంగా వ్యవహరించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి సభకు వచ్చే వారికి ఆహార ఏర్పాట్లపై దృష్టి పెట్టాలన్నారు. ట్రాన్స్పోర్టుకు సంబంధించి ఏ వాహనం ఎక్కడికి వెళ్లాలనే విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. టోల్గేట్స్ వల్ల ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకరోజు పాటు టోల్ఫీజు లేకుండా ఉచితంగా ఓపెన్ చేయాలని సూచించారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు సాధారణ ప్రజానీకం కూడా వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి ప్రోగ్రాం స్పెషల్ ఆఫీసర్ వీరపాండియన్ మాట్లాడుతూ రఽపధానమంత్రి ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై ప్రత్యేక దృిష్టి సారించాలన్నారు. శ్రీశైలంలో స్వామి వారి దర్శనం పూర్తి చేసుకున్న అనంతరం మధ్యాహ్నం కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని పాల్గొంటారన్నారు. సభకు 3 లక్షల మంది ప్రజలు రానుందున వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటుచేయాలన్నారు. సెక్యూరిటీ పరంగా 250 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు. కలెక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ ప్రధానమంత్రి పర్యటన పనులు పకడ్బందీగా జరగాలన్నారు. పార్కింగ్ ఏరియాలో ఫుడ్ కౌంటర్, మెడికల్ టీమ్, సౌండ్ సిస్టమ్, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ నెంబరుతో సైన్బోర్డ్స్ ఏర్పాటు చేయాలని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేందర్ను ఆదేశించారు. ప్రతి ఏరియాలో శానిటేషన్ సిబ్బంది ఏర్పాటు చేసి ప్రతి ఏరియా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రేపటి నుంచి సభాప్రాంగణం ఎస్పీజీ వారి ఆధ్వర్యంలో ఉంటుందన్నారు. ఎస్పీజీ సెక్యూరిటీకి సహకరించాలన్నారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ప్రధాని పర్యటన విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో అధికారులు, టీడీపీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ వై.నాగేశ్వరరావు యాదవ్ పాల్గొన్నారు.
నన్నూరు టోల్గేటు వద్ద ప్రధానమంత్రి మత్స్య సంపద వయోజన పథకం కింద చేపల విలువ ఆధారిత యూనిట్లో భాగంగా ఏర్పాటుచేసిన వైబ్ ఇన్ రెస్టారెంటును మంత్రి టీజీ భరత్, కలెక్టర్ డా.ఏ.సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు.