విశాఖ సీఐఐ సమ్మిట్ చరిత్రాత్మకం
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:42 PM
విశాఖ సీఐఐ సమ్మిట్ చరిత్రాత్మకంగా నిలుస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి
కర్నూలు అర్బన్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): విశాఖ సీఐఐ సమ్మిట్ చరిత్రాత్మకంగా నిలుస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తిక్కారెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ వ్యూహాత్మకంగా వ్యవహరించి 613 ఒప్పందాల ద్వారా రూ.13,25,716 కోట్ల పెట్టుబడులు, 16,13,188 ఉద్యోగాలు రావడం రాష్ట్ర అభివృద్ధిపై పెట్టుబడిదారుల నమ్మకానికి ప్రత్యక్ష సాక్ష్యమని అన్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వచ్చేలా కంపెనీలను గైడ్ చేశారని తెలిపారు. రెండు రోజుల్లోనే భారీ ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకొని పెట్టుబడుల వర్షం కురిపించడం చంద్రబాబు విజన్ అని కొనియాడారు. ఉమ్మడి కర్నూలు జిల్లా డ్రోన్ హబ్గా, ఉమ్మడి అనంతపురం, కడప జిల్లాలు రెన్యూవబుల్, తిరుపతి జిల్లా మాన్యఫ్యాక్చరింగ్, చిత్తూరు జిల్లా టెక్స్టైల్ హబ్గా నిలుస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ రాష్ట్రంలో రూ. 3,65,304 కోట్ల పెట్టుబడులతో 1,26,471 ఉద్యోగావకాశాలు సృష్టించే 35 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషక రమైన విషయమన్నారు. సమావేశంలో డైరెక్టర్లు సంజీవలక్ష్మి, నంద్యాల నాగేంద్ర, పోతురాజు రవికుమార్, ఆదోని నాయకుడు ఉమాపతి నాయుడు, కేవీ సుబ్బారెడ్డి, పుల్లయ్య చౌదరి పాల్గొన్నారు.