చిన్నారుల ఆరోగ్యానికి రెండు చుక్కలు
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:08 AM
చిన్నారుల ఆరోగ్యానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు.
కలెక్టర్ సిరి
కర్నూలు హాస్పిటల్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): చిన్నారుల ఆరోగ్యానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఏ.క్యాంపు ఇందిరాగాంధీ స్మారక నగర పాలక ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో చిన్నారులకు కలెక్టర్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3.52 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నారని, జిల్లాకు 6 లక్షల డోసులు వచ్చాయన్నారు. ఇందుకోసం 1,630 బూత్లను ఏర్పాటు చేశామన్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో కూడా పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు ఈ నెల 22, 23 తేదీల్లో ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది చుక్కల ముందును వేస్తారన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో ఎల్.భాస్కర్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి పి.ఉమ, కార్పొరేటర్ కైపా పద్మలత, డెమో ఎన్.ప్రకాష్రాజ్ పాల్గొన్నారు.