నేడు గురు పౌర్ణమి
ABN , Publish Date - Jul 09 , 2025 | 11:49 PM
గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తూ నిర్వహించుకునే వేడుక ‘గురు పౌర్ణమి’ని గురువారం జిల్లా వాసులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు.
కర్నూలు కల్చరల్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తూ నిర్వహించుకునే వేడుక ‘గురు పౌర్ణమి’ని గురువారం జిల్లా వాసులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. ఈ ఏడాది గురు పౌర్ణమి గురువారం రోజునే రావడం ప్రత్యేక విశేషంగా భక్తులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని షిరిడీ సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగానూ పేర్కొంటారు. ఇదే రోజున వేదవ్యాస మహర్షి జన్మతిథి కావడంతో, వేదాలు లోకానికి అందించిన వ్యాస భగవానుడిని ఈ వేడుకలో ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ నేపథ్యంలో షిరిడీ సాయిబాబా దేవాలయాల్లో, దత్తాత్రేయ మందిరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని షిరిడీ సాయిబాబా దేవాలయాల్లో, దత్తాత్రేయ మందిరాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కర్నూలు నగరంలోని ప్రముఖ ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.