పొగాకు రైతుల ఆగ్రహం
ABN , Publish Date - Jul 14 , 2025 | 11:27 PM
పొగాకు కొనుగోలులో ఓ ప్రైవేటు కంపెనీ నిర్లక్ష్యం వహించడంతో ఆ కంపెనీ తీరును నిరసిస్తూ సోమవారం పొగాకు రైతులు రోడ్డుపై ధర్నా చేపట్టారు.
రోడ్డుపై బైఠాయించి నిరసన
సీఐ, తహసీల్దార్ చొరవతో ప్రారంభమైన కొనుగోలు
గడివేముల, జూలై 14 (ఆంధ్రజ్యోతి): పొగాకు కొనుగోలులో ఓ ప్రైవేటు కంపెనీ నిర్లక్ష్యం వహించడంతో ఆ కంపెనీ తీరును నిరసిస్తూ సోమవారం పొగాకు రైతులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. కంపెనీ గేటు ముందర రైతులు చేపట్టిన ఆందోళనతో గడివేముల-నంద్యాల రహదారి ట్రాఫిక్తో స్తంభించిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జేపీఐ కంపెనీ క్వింటాకు రూ.18 వేలు ఇస్తామని ఒప్పందం చేసుకోవడంతో నంద్యాల జిల్లాలోని సంజామల, అవుకు, ఆళ్లగడ్డ, రుద్రవరం, కడప జిల్లాలో పెద్దముడియం, జమ్మలమడుగు మండలాల్లో పొగాకు పంటను సాగు చేశామని అన్నారు. పొగాకు బేళ్లను విక్రయించేందుకు కంపెనీ వద్దకు తీసుకొని వచ్చామని, కంపెనీ ప్రతినిధులు కొనకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు. నాణ్యత లేదని, క్వింటం పొగాకు రూ.3 వేలు నుంచి రూ.4 వేలకు కొంటామంటున్నారని రైతులు వాపోయారు. దీంతో రైతులు రోడ్డుపై బైఠాయించారు. తహసీల్దార్ వెకటరమణ, పాణ్యం సీఐ కిరణ్కుమార్రెడ్డి కంపెనీ ప్రతినిధులతో చర్చించి రైతులు తీసుకొచ్చిన పొగాకును కొనాలని ఆదేశించారు. తక్కువ నాణ్యత ఉన్న పొగాకు బేళ్లను క్వింటం రూ.8 వేలు కొంటామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, రైతులు మహేశ్వర్రెడ్డి, సంజీవరాయుడు, గంగయ్య, నరేంద్రకుమార్ ఉన్నారు.