పంటలను కాపాడుకునేందుకు..
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:55 PM
మండలంలోని మద్దికెర, బురుజుల, పెరవలి, ఎం.అగ్రహారం, బీఎన్ పేట, ఎడవలి, బొమ్మన పల్లి, కొత్తపల్లి, హంపా, రాంపురం గ్రామాల రైతులు హంద్రీనీవా కాలువను నమ్ముకుని 10వేల ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేశారు.

హంద్రీనీవాకు నిలిచిన నీటి సరఫరా ఫ ఇసుక మూటలు వేసి ఆఖరు బొట్టును వాడుకుంటున్న రైతులు
మద్దికెర, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మద్దికెర, బురుజుల, పెరవలి, ఎం.అగ్రహారం, బీఎన్ పేట, ఎడవలి, బొమ్మన పల్లి, కొత్తపల్లి, హంపా, రాంపురం గ్రామాల రైతులు హంద్రీనీవా కాలువను నమ్ముకుని 10వేల ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేశారు. ఈ ఏడాది వేరుశనగ, మినుము, పచ్చిమిరప వేశారు. ప్రతి ఏడాది మే రెండో వారం వరకు హంద్రీనీవా నీరు సరఫరా అయ్యేది. అయితే ఈ ఏడాది మార్చి 10వ తేదీకే నీటి సరఫరా నిలిచిపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి.
ఇసుక మూటలు వేసి..
హంద్రీనీవా కాలువలో ఉన్న కాస్త నీటిని ఉపయోగించుకునేందుకు రైతులు ఇసుకమూటలను అడ్డంగా వేసి, ఆ నీటిని వాడుకుంటున్నారు. అంతేగాక బురుజుల పంచాయతీ వారు కూడా ఈ హంద్రీనీవా నీటినే నిల్వ చేసి, తాగునీరు అందిస్తారు. అయితే ఈ ఏడాది ఉన్న ఫలంగా నీరు నిలిచిపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి, తాగునీటి అవసరాలకు కూడా ఇబ్బంది పడే ప్రమాదముంది.