Share News

ముచ్చటగా ముగ్గురు...!

ABN , Publish Date - May 11 , 2025 | 12:14 AM

నందికొట్కూరు నియోజకవ ర్గంలో రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి.

ముచ్చటగా ముగ్గురు...!
భూమిపూజ చేస్తున్న ఎంపీ శబరి

నందికొట్కూరులో అగ్నిమాక కేంద్రం భవన నిర్మాణానికి భూమిపూజ

వేర్వేరుగా పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌

మరోమారు తేటతెల్లమైన విభేదాలు

నందికొట్కూరు, మే 10 (ఆంధ్రజ్యోతి): నందికొట్కూరు నియోజకవ ర్గంలో రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల మున్సిపల్‌ చైర్మన్‌ అవిశ్వాస అంశంలో ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య వర్గపోరు బహిర్గతమైన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు తాజాగా నంది కొట్కూరులో ఓ భవన నిర్మాణానికి సంబంధించి భూమిపూజ విషయంలో అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. శనివారం పట్టణంలోని బైరెడ్డి నగర్‌లో నియోజకవర్గ అగ్నిమాపక కేంద్ర నూతన భవన నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, మున్సిపల్‌ చైర్మన్‌ దాసి సుధాకర్‌ రెడ్డిలు వేర్వేరుగా వేర్వేరు సమయాల్లో భూమిపూజ చేయడం హాట్‌ టాఫిక్‌గా మారింది. ముందుగా ముహూర్తం దాటిపోతుందన్న నెపంతో ఉదయం 9:41 గంటలకు మున్సిపల్‌ చైర్మన్‌ దాసి సుధాకర్‌ రెడ్డి వార్డు కౌన్సిలర్‌ చాంద్‌బాషతో శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గిత్తా జయసూర్య 10:17 గంటలకు చేరుకుని మళ్లీ శంకుస్థాపన చేశారు. ఇక ఎంపీ బైరెడ్డి శబరి 11:02 గంటలకు చేరుకుని ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన చేశారు. ఇదిలా ఉండగా శంకుస్థాపనల తంతు పూర్తి చేసేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ఒకే పార్టీ నుంచి గెలిచిన వారు ఇలా వేర్వేరుగా పాల్గొనడం కేడర్‌లో గందరగోళానికి దారి తీసింది.

Updated Date - May 11 , 2025 | 12:15 AM