మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టాలి
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:45 PM
జిల్లాలో మత్తుపదార్థాల రవాణా వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రంజిత్ బాషా
సమన్వయంతో అన్నిశాఖల అధికారులు కృషి చేయాలి
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు కలెక్టరేట్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మత్తుపదార్థాల రవాణా వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ (ఎన్సీవోఆర్డీ) సమా వేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూనివర్సిటీలు, కాలేజీల్లో మత్తుపదార్థాల వినియోగంపై వర్క్షాపులు, ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు మెడికల్ కాలేజీలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పించి మత్తు పదార్థాల వినియోగం జరగకుండా చర్యలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ మత్తుపదా ర్థాల వినియోగం, సాగును పూర్తిగా నియంత్రించే విధంగా అన్నిశాఖల అధికారులు కృషిచేయాలన్నారు. కేసీ కెనాల్, బస్టాండు, రైల్వేస్టేషన్లలో రాత్రి సమయాల్లో పార్కులు, ఖాళీప్రదేశాలు, ఫ్లైఓవర్ లాంటి వాటిలో నిఘా ఉంచడం జరుగుతోందన్నారు. రైల్వే, లోకల్ పోలీసు, ఈగల్ టీమ్స్, ఎక్సైజ్ సిబ్బంది టాస్క్ఫోర్స్గా ఏర్పడి తనిఖీలు చేయాలని సూచించారు. జడ్పీ సీఈవో నాసరరెడ్డి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ పాల్గొన్నారు.