శ్రీమఠంలో ముగిసిన సప్తరాత్రోత్సవాలు
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:52 PM
మంత్రాలయం రాఘవేంద్రస్వామి 354వ సప్తరాత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి.
పంచరథ వాహనంపై దర్శనమిచ్చిన ప్రహ్లాదరాయలు
బంగారు పల్లకిపై రాఘవేంద్రుడి విహారం
మంత్రాలయం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి 354వ సప్తరాత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. గురువారం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు పంచవాహన రథానికి పూజలు చేసి ప్రారంభించారు. ఏడు రోజులు జరిగిన సప్తరాత్రోత్సవాలకు పీఠాధిపతి సర్వసమర్పణతో ఉత్సవాలకు ముగింపు పలికారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను వజ్రాలతో పొదిగిన హారాలతో అలంకరించి స్వర్ణ పల్లకిలో అధిష్టించి ఊరేగించి ఊంజల సేవ చేశారు. అనంతరం గజ వాహనం, చెక్క, వెండి, బంగారు, నవరత్నాల రథాలపై ఊరేగించారు. చెక్కరథంపై సంహం, అశ్వ, గజ, స్వర్ణ పల్లకి, పంచ వాహనాలను సుందరంగా తీర్చిదిద్ది వాటి మద్య రాఘవేంద్రస్వామి నిల్వ ప్రతిమను అలంకరించి అందులో ఉత్సవమూర్తి ప్రహ్లాదరయాలను అధిష్టించి పీఠాదిపతులు మహామంగళహారతులు ఇచ్చి పంచవాహన రథోత్సవాన్ని ఊరేగించారు. ఈ వేడుకలో పండిత కేసరి రాజా ఎస్.గిరిరాజాచార్, మఠం దివాన్ సుజీంద్రాచార్, ఆనంద తీర్థాచార్, గౌతమాచార్, ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, సురేష్ కోనాపూర్,, శ్రీపతాచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ఏఈలు బద్రినాథ్, శ్రీహరి, వ్యాసరాజాచార్, బిందు మాధవ్, ద్వారపాలక అనంతస్వామి, జయతీర్థాచార్, వాధిరాజాచార్లు పాల్గొన్నారు.
అలరించిన భరతనాట్యం: ఉత్సవాల ముగింపులో భాగంగా యోగీంద్ర కళామండపంలో గురువారం రాత్రి చెన్నైకి చెందిన చిత్రామయ డ్యాన్స్ స్కూల్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం ఆకట్టుకుంది. బెంగుళూరు చెందిన విద్వాన్ ఎన్హెచ్ ప్రసాద్ మండోలిన్ వాయిద్యం, పూణేకి చెందిన ఆనంద్ భీమ్సేన్ జోషీచే నిర్వహించిన హిందుస్థాని సంగీతం భక్తులను అలరించింది.