సైనికుల సేవలు ఎనలేనివి
ABN , Publish Date - May 11 , 2025 | 12:09 AM
దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సైనికుల సేవలు ఎనలేనివని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్
టీజీవీ కళాక్షేత్రంలో ‘జై జవాన్’ కల్చరల్ ఫెస్ట్ ప్రారంభం
కర్నూలు కల్చరల్, మే 10 (ఆంధ్రజ్యోతి): దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సైనికుల సేవలు ఎనలేనివని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన ‘జై జవాన్’ కల్చరల్ ఫెస్టివల్ను ఆయన శనివారం ఘనంగా ప్రారంభించారు. తొలుత భరతమాత చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ తన పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ‘జై జవాన్ ఫెస్టివల్’ నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏటా మే16వ తేదీన కులమతాలకు అతీతంగా సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇంకా ఎవరైనా జంటలు పేర్లు నమోదు చేసుకోవాలనుకుంటే ఆదివారంలోగా సంప్రదించాలన్నారు. మనం ఎంత సేవ చేసినా సముద్రంలో నీటిబొట్టులాంటిదేనని, కానీ దేశానికి సేవలు అందించే సైనికుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకే భారత ప్రధాని మోదీ యుద్ధానికి సిద్ధపడ్డారన్నారు. ఇప్పటికే టెర్రరిస్టు స్థావరాలను నాశనం చేశారని, ప్రతిదాడులని తిప్పి కొట్టారని చెప్పారు. ఈ సందర్భంగా దేశభక్తిపై రూపొందించిన సాంస్కృతిక అంశాలను ప్రదర్శించిన కళాకారులను ఆయన శాలువలతో ఘనంగా సత్కరించారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ కళాక్షేత్రంలో వారం రోజుల పాటూ దేశభక్తిని చాటిచెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజూ ఒక గంట ప్రదర్శిస్తారమని, దేశ సైనికులకు సంఘీభావం తెలుపుతూ టీజీవీ కళాక్షేత్రం పక్షాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారులు మహ్మద్ మియా, యాగంటీశ్వరప్ప, శ్రీనివాసరెడ్డి, సీవీ రెడ్డి, వీవీ రమణారెడ్డి, పి.రాజారత్నం, వాల్మీకి రాముడు తదితరులు పాల్గొన్నారు.
దేశభక్తిపై ప్రదర్శనలు : ఒకవైపు ఉప్పొంగే దేశభక్తిని, మరోవైపు దేశం సరిహద్దులో యుద్ధం చేస్తూ దేశానికి రక్షణగా నిలుస్తున్న సైనికుల వీరోచిత పోరాటాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అసాంతం అలరింపజేశాయి. కళాకారులు శ్రీనివాసరెడ్డి, సంగా ఆంజనేయులు, నృత్యకళాకారులు కరీముల్లా, సుమాంజలి, కార్తీక, సుదేష్ణ, సత్య, తేజశ్విని, తన్విశ్రీ, కేదారి, గాయకులు సుజాత, మహ్మద్ మియా, ఘంటసాల శ్రీనివాస్, ఖాజావలి, కె. బాలవెంకటేశ్వర్లు, జానపద నృత్యకారులు సమీర, అఖిల, హరిబాబు, సుబ్బరాయుడు, నారాయణ తదితరులు అలరించారు.
నేడు రామాంజనేయ యుద్ధం నాటకం : జై జవాన్ కల్చరల్ ఫెస్ట్లో భాగంగా ఆదివారం సాయంత్రం దేశభక్తిని ప్రబోధించే జానపద, సినీ సంగీత విభావరి, అనంతరం రామాంజనేయ యుద్ధం నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య తెలిపారు.