బాలల సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:39 PM
బాలల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు.
విద్యా ప్రమాణాలను పెంచుతున్నాం
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ
కర్నూలు హాస్పిటల్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): బాలల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం పెద్దపాడులోని దామోదరం సంజీవయ్య బాలసదరాన్ని ఆమె సందర్శించారు. చిన్నారులు, వసతి గృహాల వార్డెన్లు చైర్పర్సన్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా బాల్య వివాహాల నివారణ అంశంపై విద్యార్థులు ప్రదర్శించిన నాటికను చైర్పర్సన్ శైలజ వీక్షించారు. వసతి గృహంలోని డైనింగ్ హాలు, వంటగది, స్టోర్ రూం విద్యార్థుల పడక గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలసదరంలో విద్యతో పాటు బాలల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ల గురించి అవగాహన కల్పిస్తూ పిల్లలు బయటి ప్రపంచంలో ఎలా మెలగాలో అత్యవసర పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పిల్లలు బాగా చదువుకోవాలన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ బాలసదరంలో 48 మంది పిల్లలు ఉన్నారనీ, వీరికి మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉందనీ అన్నారు. వీటిని కల్పించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. బాల్యవివాహాలు చేయకూడదని తల్లిదండ్రులకు, పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం నగరంలోని బీ.క్యాంపులో ఉన్న బీసీ బాలిక సంక్షేమ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ డైరెక్టర్ రోహిణి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.విజయ పాల్గొన్నారు.