రక్తి కట్టని జగన్నాటకం
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:18 PM
అక్రమాస్తుల కేసులో నిందితుడిగా సీబీఐ కోర్టుకు హాజరైన జగన్ .. అనుచరులతో ఆడిన నాటకం రక్తి కట్టలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి
కర్నూలు అర్బన్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసులో నిందితుడిగా సీబీఐ కోర్టుకు హాజరైన జగన్ .. అనుచరులతో ఆడిన నాటకం రక్తి కట్టలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 16 నెలలు జైలు జీవితం గడిపి బెయిల్పై బయటకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాకుండా సాకులు చెబుతు ఇంత కాలం కోర్టు కళ్లు కప్పి తిరిగారన్నారు. ఎట్టకేలకు సీబీఐ కోర్టు ఆదేశాలతో కోర్టుకు హాజరుకావాల్సి వచ్చిందన్నారు. కోర్టు దృష్టిని మరల్చేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలతో హైదరాబాద్లో రఫా.. రఫా డైలాగులతో ర్యాలీలు నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు వ్యవస్థలను జగన్ నాశనం చేశాడ న్నారు. గత పాలనలో చేసిన అరాచక పాలనకు ప్రతి ఫలంగా ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితం చేసినా జగన్కు జ్ఞానం రాలేదన్నారు. బలప్రదర్శనలు చేసి వ్యవస్థలను భయపెట్టాలనే ప్రయత్నాలను మానుకోవాలని హితవుపలికారు.