ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి
ABN , Publish Date - Oct 30 , 2025 | 11:22 PM
జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కలెక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
నాబార్డు ద్వారా ఆర్ఐడీఎఫ్ నిధులు వినియోగించుకోవాలి
స్టాండ్ ఆఫ్ ఇండియా పథకంపై అవగాహన కల్పించాలి
కర్నూలు కలెక్టరేట్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కలెక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో 3 రోజుల పాటు 91 శాఖల అధికారులతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించడంలో భాగంగా గురువారం వ్యవసాయం, ఉద్యాన, మార్కెటింగ్, సెరికల్చర్, మార్కెటింగ్, పశుసంవర్థక, డీఆర్డీఏ, మెప్మా, నాబార్డు, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాబార్డు డ్వారా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నిధులను వినియోగించుకునేలా ఆయా శాఖల అధికారులు ప్రతిపాదనలు రూపొం దించాలని ఆదేశించారు. స్టాండ్ ఆఫ్ ఇండియా పథకంపై అవగాహన కల్పించి, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రుణాల మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చేనేతలకు ఇచ్చే ముద్ర రుణాలను మరింత పెంచాలన్నారు. సీసీఆర్సీ కార్డులు ఉన్న వారికి రుణాలు ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, డీఆర్వో సి. వెంకట నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.