డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం
ABN , Publish Date - May 03 , 2025 | 11:17 PM
సిద్ధాపురం చెరువుకట్ట సమీపంలో కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం డ్రైవర్ అజాగ్రత్త వల్లే జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి
ఐదు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
ఆత్మకూరు, మే 3(ఆంధ్రజ్యోతి): సిద్ధాపురం చెరువుకట్ట సమీపంలో కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం డ్రైవర్ అజాగ్రత్త వల్లే జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈమేరకు శనివారం ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, అర్బన్ సీఐ రాము సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయగా పలు వాస్తవాలు వెలుగు చూశాయి. ఆదోని పట్టణంలోని రాయచోటి సుబ్బయ్యనగర్, ఇంది రానగర్, రాజీవ్గాంధీనగర్తో పాటు గోనెగండ్ల మండలంలోని ఎర్రపాడు గ్రామానికి చెందిన సుమారు 25 మంది బంధుమిత్రులు గురువారమే శ్రీశైలానికి బొలెరో ట్రాలీ వాహనంలో బయలుదేరి వె ళ్లారు. శుక్రవారం స్వామిఅమ్మవార్ల దర్శనం పూర్తిచేసుకుని మధ్యా హ్నం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే మార్గమధ్యలోని నల్లమల అటవీ ప్రాంతంలో వర్షం కురవడంతో ట్రాలీలో ఎగువ భాగంలో చెక్క పలకలపై కూర్చున్న వారు తమ వెంట తెచ్చుకున్న టార్ఫాలిన్ కవర్ను కప్పేసుకున్నారు. ఈక్రమంలోనే టార్ఫాలిన్ కప్పేసుకోవడంతో సరిగ్గా ఊపిరి ఆడకపోవడంతో కొంతమంది ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ పరిస్థితుల్లో బైర్లూటి చెక్పోస్టు రాగానే వాహనాన్ని నిలిపివేసి ట్రాలీ వాహనంలో ప్రయాణిస్తున్న వారందరు కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక కిమీ వ్యవధిలోనే అతివేగంతో బొలెరో ట్రాలీ వెళ్లి సడెన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి కుడివైపున బోల్తాపడింది. ట్రాలీలో చెక్కలపై పైభాగాన కూర్చున్నవారు కింద పడిపోగా వారిపై వాహనం పల్టీ కొట్టి తిరిగి యథాస్థితిలో నిలిచినట్లు గుర్తించారు. ఈప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా మరో 15మందికి గాయాలయ్యాయి. ఓవైపు చిరు జల్లులతో కూడిన వర్షం వల్ల రోడ్డు చిత్తడిగా మారి వాహనం అదుపు తప్పే అవకాశం ఉన్నప్పటికీ వాహనాన్ని డ్రైవర్ అతివేగంతో నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మం డ్లిపల్లి రాంప్రసాద్రెడ్డి అధికారులతో ఆరాతీశారు. రోడ్డు ప్రమాదం నేపథ్యంలో శ్రీశైలానికి వెళ్లే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిని ఆర్టీసీ బస్సులో పంపించారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న వాహనాలకు పోలీసులు జరిమానా విధించారు.
పోస్టుమార్టం పూర్తి: ఘోర దుర్ఘటనలో గిడ్డయ్య (42), శశికళ (40), లక్ష్మీ (28) అక్కడికక్కడే మృతిచెందారు. చంద్రమ్మ(31) తీవ్ర గాయాలపాలై ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. అదేవిధంగా కుమార్ (17) కర్నూలులో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ఆత్మకూరు లోని నలుగురి మృతదేహాలకు ఆత్మకూరు అర్బన్, రూరల్ సీఐలు రాము, సురేష్కుమార్రెడ్డి, ఎస్ఐ నారాయణరెడ్డి నేతృత్వంలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అదేవిధంగా కర్నూలులో మృతిచెందిన కుమార్ మృతదేహానికి నందికొట్కూరు ఎస్ఐ చంద్ర శేఖర్ పర్యవేక్షణలో అక్కడి వైద్యులు పోస్టుమార్టం చేసి, బంధు వులకు మృతదేహాలను అప్పగించారు.
చికిత్స పొందుతూ బాలుడి మృతి
ఆత్మకూరు మండలంలో జరిగిన
రోడ్డు ప్రమాదంలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య
గోనెగండ్ల, మే 3(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు మండలం సిద్ధాపురం చెరువు దగ్గర శుక్రవారం జరిగి రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య శనివారం ఐదుకు చేరింది. రోడ్డు ప్రమాద ఘటనలో తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన కురువ కుమార్(15) కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం తెల్లవారు జామున మృతి చెందాడు. దీంతో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. వివరాలివీ.. ఎర్రబాడు గ్రామానికి చెందిన సునీల్, సునీత దంపతులు ఇద్దరు కుమారులు. సునిల్ ట్రాలీ వాహనం నడుపుతూ జీవనం సాగించేవాడు. పెద్ద కుమారుడు కుమార్ సున్నిపెంటలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు. ఇటీవల పరీక్షల ఫలితాలు వెలువడటంతో ఫలితాలలో కుమార్ 514 మార్కులు సాధించాడు. ఆదోనికి చెందిన పరిచయస్థులు సునీల్ వాహనాన్ని శ్రీశైలానికి వెళ్లేందుకు బాడుగకు మాట్లాడుకున్నారు. సునీల్ తన కుమారుడు కుమార్ పదిలో మంచి మార్కులు సాధించిన సందర్భంగా తన వాహనంలో శ్రీశైలానికి తీసుకువెళ్లాడు. శ్రీశైలంలో దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో శుక్రవారం సిద్దాపురం చెరువు దగ్గర వాహనం అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ సంఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 14మందికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయాల పాలైన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమార్ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుమార్ మృతదేహాన్ని శనివారం ఎర్రబాడు గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.