Share News

కర్నూలు ఎయిర్‌పోర్టు ఎఫ్‌టీఓకు టాక్సీవే

ABN , Publish Date - May 05 , 2025 | 11:44 PM

ఓర్వకల్లులోని కర్నూలు విమానాశ్రయంలో ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనేజేషన్‌ (ఎఫ్‌టీఓ)కు అనుసంధానం చేసే టాక్సీవే నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.2.27 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కర్నూలు ఎయిర్‌పోర్టు ఎఫ్‌టీఓకు టాక్సీవే

రూ.2.27 కోట్లు మంజూరు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

కర్నూలు, మే 5 (ఆంధ్రజ్యోతి): ఓర్వకల్లులోని కర్నూలు విమానాశ్రయంలో ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనేజేషన్‌ (ఎఫ్‌టీఓ)కు అనుసంధానం చేసే టాక్సీవే నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.2.27 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కర్నూలు విమానాశ్రయంలో విమాన శిక్షణ సంస్థ (ఎఫ్‌టీఓ) ఏర్పాటు కోసం ఓరియంట్‌ ఫ్లైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో ఏపీ ఏయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఏడీఎల్‌సీ) 2024 జూలై 26న ఒప్పందం కుదుర్చుకుంది. షరతుల ప్రకారం ఎఫ్‌టీవో 12 నెలల్లో శిక్షణ కార్యక్రమాలు మొదలు పెట్టాలి. అందుకు అనుగుణంగా రన్‌వే నుంచి హంగర్‌ వరకు టాక్సీవేను ఏపీఏడీసీఎల్‌ నిర్మించి ఇవ్వాలని ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. అందుకోసం రూ.2.27 కోట్లు నిధులు మంజూరు, పరిపాలన అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఏపీఏడీసీఎల్‌ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పరిశీలించిన ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది. రన్‌వే నుంచి హంగర్‌ వరకు టాక్సీవే నిర్మాణం పూర్తి చేస్తే కర్నూలు విమానాశ్రయం కేంద్రంగా విమాన శిక్షణ కార్యక్రమాలు ఊపందుకుంటాయి.

Updated Date - May 05 , 2025 | 11:44 PM