గ్రామాల పరిశుభ్రతకే ‘స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్’
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:02 AM
గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్’ నిర్వహిస్తోందని జడ్పీ సీఈవో జి.నాసర రెడ్డి అన్నారు.
ప్రజలతో మమేకమై అవగాహన కల్పించండి
జడ్పీ సీఈవో జి. నాసర రెడ్డి
ఓర్వకల్లు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్’ నిర్వహిస్తోందని జడ్పీ సీఈవో జి.నాసర రెడ్డి అన్నారు. మంగళవారం ఎంపీడీవో శ్రీనివాసులు కలిసి ఆయన మండలంలోని లొద్దిపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ వాహనం మీ ఇంటి వద్దకు వస్తుందా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చెత్త సేకరణపై అవగాహన కల్పించారు. చెత్త సేకరణపై ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా గ్రామ సమాచారాన్ని కోరినప్పుడు ఏ విధంగా సమాధానం ఇవ్వాలో ప్రజలకు వివరించారు. గ్రామంలోని చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించి తడి, పొడి చెత్తను సక్రమంగా వేరు చేస్తున్నారా అని గ్రీన్ అంబాసిడర్లను ప్రశ్నించారు. జడ్పీ హైస్కూల్ను సందర్శించి విద్యార్థుల హాజరు, ‘తల్లికి వందనం’ జాబితా, రికార్డులను తనిఖీ చేశారు. గ్రామంలో మంచినీటి సరఫరా ట్యాంకు వద్ద క్లోరినేషన్ తేదీలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రజలతో మమేకమై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను జడ్పీ సీఈవో ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి మద్దిలేటి, గ్రీన్ అంబాసిడర్లు తదితరులు పాల్గొన్నారు.