జనాభా నిర్వహణ విధానంపై సర్వే: కలెక్టర్
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:50 PM
భవిష్యత్తు తరాలకు మంచి సమాజాన్ని అందించేందుకు ప్రత్యేకమైన జనాభా నిర్వహణ విధానం రూపొందించేందుకు సర్వే నిర్వహిస్తామని కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.

కర్నూలు కలెక్టరేట్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తు తరాలకు మంచి సమాజాన్ని అందించేందుకు ప్రత్యేకమైన జనాభా నిర్వహణ విధానం రూపొందించేందుకు సర్వే నిర్వహిస్తామని కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటో రియంలో జనాభా నిర్వహణ విధానం (పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ-2025)పై జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీ డీవోలు, స్టాటిస్టికల్ ఆఫీసర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా నిర్వహణ విధానం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ పేపర్ను విడుదల చేశారన్నారు. సాధారణంగా జనాభా పెరుగుదల, తగ్గుదలలో వివిధ రకాల కారణాలు ఉంటాయన్నారు. 2025లో భారతదేశంలో 141కోట్ల జనాభా ఉందని, ఇదే బర్త్ రేట్తో కొనసాగినట్లయితే 2061 సంవత్సరంలో 165కోట్ల జనాభా ఉంటుందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా క్యూఆర్ కోడ్ ద్వారా 9 ప్రశ్నలు ఇవ్వడం జరిగిందని, వాటి ద్వారా ప్రజల నుంచి అభిప్రాయలను సేకరించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. కార్యక్రమంలో కర్నూలు నగర పాలక కమిషనర్ రవీంద్రబాబు, ఇన్చార్జి డీఆర్వో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్వో శాంతికళ, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ హిమప్రభాకర్ రాజు, ఐసీడీఎస్ పీడీ నిర్మల, సెట్కూరు సీఈవో వేణుగోపాల్, పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్, మెప్మా పీడీ నాగశివలీల, టూరిజం అధికారి విజయ తదితరులు పాల్గొన్నారు.