Share News

మహిళల భద్రతకు పటిష్ట చర్యలు

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:13 PM

మహిళల భద్రతకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ పేర్కొన్నారు.

మహిళల భద్రతకు పటిష్ట చర్యలు
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ

మహిళా కమిషన్‌ దృష్టికొచ్చిన సమస్యలు పరిష్కరిస్తాం

రాష్ట్రంలో 156 శక్తిటీమ్‌లు ఏర్పాటు

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ

సమస్యలపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్‌ రాజకుమారి

మహిళల భద్రతపై అవగాహన సదస్సు

నంద్యాల ఎడ్యుకేషన్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): మహిళల భద్రతకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎ్‌సలో కలెక్టర్‌ రాజకుమారి అధ్యక్షతన మహిళా సంక్షేమం, భద్రత, మహిళా సాధికారత అనే అంశాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను ఆమె పరిశీలించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ విద్యార్థినులకు చదువు ఎంతో ముఖ్యమో భద్రత కూడా అంతే ప్రధానమన్నారు. ఘటన జరిగిన తర్వాత తీసుకునే చర్యలకంటే ఘటన జరగకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బాలికలకు, మహిళలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. మహిళా కమిషన్‌ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందిస్తూ చర్యలు తీసుకుంటున్నామన్నారు. నంద్యాల జిల్లాకు సంబంధించి కేవలం రెండు అర్జీలు వచ్చాయని, అందులో వెలుగోడులో మైనర్‌ బాలికపై జరిగిన సంఘటన కమిషన్‌ సుమోటోగా తీసుకుని విచారించిందన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైందని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ఐసీసీ) ఏర్పాటుచేయాలన్నారు. ఈకమిటీలపై జిల్లా యంత్రాం గం విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో మహిళల సంరక్షణ కోసం 156 శక్తిటీమ్‌లను ఏర్పాటుచేసి 900 ప్రదేశాలను గుర్తించామన్నారు. విద్యార్థినులు సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. స్త్రీ, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వన్‌స్టా్‌ఫ సెంటర్‌ల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో మహిళల, పిల్లల భద్రతకు ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటుచేయడం జరుగుతోందన్నారు. జిల్లా కొత్తగా ఏర్పాటయ్యాక శిశుగృహాన్ని, డీసీపీయూ యూనిట్‌ను, వన్‌స్టా్‌ఫ సెంటర్‌ను ఏర్పాటుచేసుకున్నామన్నారు. ఆరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో 1663 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయని వివరించారు. 48 హాబిటేషన్స్‌లో 2500 చెంచు జాతి కుటుంబాలున్నాయని, 8 వేల జనాభాలో పిల్లలు ఎక్కువగా ఉన్నారన్నారు. సామాజికంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఏఎస్పీ జావలి మాట్లాడుతూ మహిళల బధ్రతకు పోలీసుశాఖ నిరంతరం కృషిచేస్తోందన్నారు. కళాశాలల్లో చదువుతున్న అమ్మాయిలు సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కలిగి ఉండా లన్నారు. జిల్లాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన మహిళా మేలుకో బ్రోచర్‌ను విడు దల చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ లీలావతి, సీఐలు గౌతమి, జయరామ్‌, సీడీపీవోలు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 11:13 PM