ఓటర్ల మ్యాపింగ్ పకడ్బందీగా చేయండి
ABN , Publish Date - Nov 27 , 2025 | 11:35 PM
జిల్లాలో నిర్వహిస్తున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఏ. సిరి శిక్షణ అధికారులను ఆదేశించారు.
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్వహిస్తున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఏ. సిరి శిక్షణ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలోని సునయన ఆడిటోరియంలో కర్నూలు అర్బన్, పాణ్యం, ఆదోని నియోజకవర్గాల బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్వో)లతో ఎస్ఐఆర్-2026 శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందరభంగా కలెక్టర్ మాట్లాడుతూ బీల్వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల గురించి విచారించి, నిర్ణీత ఫారంలలో ఓటరు వివరాలు సేకరించుకోవాలని, ఆ తర్వాతనే డ్రాఫ్ట్ రోల్లో పేర్లు ఉంచాలని తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తదితరులు పాల్గొన్నారు.
మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి తీసుకుని రావాలి
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి తీసుకుని రావాలని ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కలెక్టర్ను ఆదేశించారు. గురువారం విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఫామ్స్ను త్వరగా క్లియర్ చేయాలన్నారు. కలెక్టర్ డా.ఏ. సిరి మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు సంబంధించి ఈఆర్వోలకు, ఏఈఆర్వోలకు, బీఎల్వోలకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించామన్నారు.