సంగమేశ్వరంలో స్పీడ్ బోటు బోల్తా
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:53 PM
కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరంలోని కృష్ణానదిలో ఇంకా ప్రారంభానికి నోచుకోని అటవీ శాఖకు చెందిన ఓ స్పీడ్ బోటు అలల తాకిడికి బోల్తా పడింది.

ఎక్స్కవేటర్ సాయంతో బయటికి తీసిన అటవీ అధికారులు
కొత్తపల్లి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరంలోని కృష్ణానదిలో ఇంకా ప్రారంభానికి నోచుకోని అటవీ శాఖకు చెందిన ఓ స్పీడ్ బోటు అలల తాకిడికి బోల్తా పడింది. ఇటీవలనే అటవీ అధికారులు కాకినాడ నుంచి సంగమేశ్వరం తెచ్చిన నూతన స్పీడ్ బోటును అటవీ అధికారుల పర్యవేక్షణలో సంగమేశ్వరం నుంచి నది జలాల మీదుగా శ్రీశైలానికి పంపించాల్సి ఉంది. ఇంకా ప్రారంభానికి నోచుకోని ఏసీ స్పీడ్ బోట్ను నదిలోనే తాళ్లతో కట్టి ఉంచినప్పటికీ అలల తాకిడికి బోల్తా పడి మునిగిపోయింది. గత రెండు రోజులుగా ఆత్మకూరు రేంజ్ అధికారి పట్టాభి పర్యవేక్షణలో సిబ్బందితో పాటు పరిసర ప్రాంతాల మత్స్యకారుల సాయంతో బోటును నది ఒడ్డుకు చేర్చేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎట్టకేలకు సోమవారం మధ్యాహ్నం ఎక్స్కవేటర్ సాయంత్రం స్పీడ్ బోటును నది ఒడ్డుకు చేర్చారు. సుమారు 14 మంది ప్రయాణించే ఈ స్పీడు బోటుకు ఏమీ కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.