పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
ABN , Publish Date - May 03 , 2025 | 11:04 PM
నీట్ (నేషనల్ ఎలిజిబీలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ) పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ అదిరాజ్సింగ్ రాణా అన్నారు.
నెట్, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలి
ట్రాఫిక్ సమస్య ఉండకూడదు
ఎస్పీ అదిరాజ్సింగ్ రాణా
నీట్ పరీక్షా కేంద్రాల తనిఖీ
నంద్యాల టౌన్ మే, 3 (ఆంధ్రజ్యోతి): నీట్ (నేషనల్ ఎలిజిబీలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ) పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ అదిరాజ్సింగ్ రాణా అన్నారు. శనివారం నీట్ పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, జూనియర్ కళాశాలలలో ఆదివారం నీట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1,172 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ఉన్న జిరాక్స్, నెట్ సెంటర్లు పరీక్ష ముగిసేవ వరకు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థులను ప్రతిఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీచేసి లోపలికి పంపాలన్నారు. అవసరమైతే డ్రోన్ కెమెరాల ద్వారా పరీక్షా కేంద్రాలను పరిశీలిస్తామన్నారు. ఆయనతో పాటు ఆర్డీవో విశ్వనాధ్, తహసీల్దార్ ప్రియదర్శిని, నీట్ కోఆర్డినేటర్ సత్యనారాయణ, సీఐలు ఇస్మాయిల్, కంబగిరిరాముడు, సూర్యమౌలి, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.