పాఠశాలను యథావిధిగా కొనసాగించాలి
ABN , Publish Date - Jul 01 , 2025 | 12:37 AM
కర్నూలు బి.క్యాంపులోని ఎంపీయూపీ పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
3 నుంచి 8 తరగతలను హైస్కూల్లో విలీనం చేయొద్దు
విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
కర్నూలు ఎడ్యుకేషన్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): కర్నూలు బి.క్యాంపులోని ఎంపీయూపీ పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని బి.క్యాంపు ఎంపీయూపీ పాఠశాల ఎదుట సోమవారం తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ పాఠశాలలోని 3 నుంచి 8 తరగతులను సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం సరికాదన్నారు. ఈ పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థులు చదువుతున్నారని, అలాంటి పాఠశాలలోని తరగతులను ఇతర పాఠశాలలో తరలించడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుబట్టారు. అక్కడికి చేరుకున్న డీఈవో శామ్యూల్ పాల్ విద్యార్థుల తల్లిదండ్రులను నచ్చజెప్పడానికి అనేక ప్రయత్నాలు చేశారు. హై స్కూల్లో తరగతులు విలీనం చేయడం వల్ల అక్కడ నిష్ణాతులైన ఉపాధ్యాయులతో పాటు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు ఉంటాయని దీని వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. పాఠశాల విలీనం తమ చేతుల్లో లేదని, రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నిబంధనల మేరకు తరగతులను ఇతర పాఠశాలలో విలీనం చేశామని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనలు విరమించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.