జీజీహెచ్లో స్కానింగ్ సమస్యలు
ABN , Publish Date - Jul 23 , 2025 | 11:29 PM
సీజనల్ వ్యాధులు, జబ్బుల నివారణ కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వస్తున్న రోగుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి.
కర్నూలు హాస్పిటల్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): సీజనల్ వ్యాధులు, జబ్బుల నివారణ కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వస్తున్న రోగుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. అందులోనూ స్కానింగ్ కోసం వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఓపీ ఉంటుంది. ఓపీకి వెళ్లిన రోగులకు వైద్యులు పరిశీలించి వారికి అవసరమైతే అల్ర్టాసౌండ్ స్కానింగ్ పరీక్ష రాస్తారు. ఈ పరీక్ష కోసం వెళ్తే రోగులకు చుక్కలు చూపిస్తున్నారు. బుదవారం పాత రేడియాలజి సర్జికల్ ఓపీ నెంబర్ (14) పక్కన ఉన్న అలా్ట్రసౌండ్ స్కానింగ్ (నెంబరు.4) దగ్గర రోగులు గొడవ పడ్డారు. 100 మంది పరీక్షల కోసం వస్తే 30 మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చారని, ఇంకా ఎన్నిసార్లు ఈ పరీక్షల కోసం తిరగాలంటూ సిబ్బందితో గొడవకు దిగారు. 30 టోకెన్లకు మాత్రమే పరీక్షలు చేస్తామని విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయనీ, రేడియాలజీ వైద్యులు చెప్పడంతో రోగులు గంటల తరబడి పరీక్షల కోసం నిరీక్షించారు. ఇక్కడ న్యూడయోగ్నస్టిక్ బ్లాక్ వద్ద కూడా స్కానింగ్ టోకెన్ల కోసం ఇదే పరిస్థితి నెలకొంది.