రైతు ఖాతాల్లో రూ.8 లక్షలు మాయం
ABN , Publish Date - Jul 08 , 2025 | 01:14 AM
మండలం లోని హెబ్బటం గ్రామానికి చెందిన రైతు కురువ రంగస్వామి బ్యాంకు ఖాతాల్లో రూ.8 లక్షలు మాయమ య్యాయి. దీంతో బాధిత యువరైతు సోలీసులను ఆశ్రయించారు.
పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
హొళగుంద, జూలై 7(ఆంధ్రజ్యోతి): మండలం లోని హెబ్బటం గ్రామానికి చెందిన రైతు కురువ రంగస్వామి బ్యాంకు ఖాతాల్లో రూ.8 లక్షలు మాయమ య్యాయి. దీంతో బాధిత యువరైతు సోలీసులను ఆశ్రయించారు. వివరాలివీ.. రంగస్వామి కొన్ని నెలల క్రితం 15 ఎకరాల పొలంలో పండించిన 400 బస్తాల బ్యాడిగి మిరపను గత నెల 24న కర్ణాటకలోని బ్యాడిగి మిరప మార్కెట్లో వ్యాపారులకు రూ.9.02 లక్షలకు విక్రయించారు. గతనెల 30వ తేదీన వ్యాపారులు రైతుకు సంబంధించిన ఆదోనిలోని బ్యాంకు ఆఫ్ బరోడా ఖాతాలో రూ.4.02 లక్షలు, కెనరా బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షలు జమ చేశారు.
బ్యాంక్లో ఉన్న నగదును డ్రా చేస్తే ఇంట్లో పెట్టుకోవడానికి బయపడి బ్యాంక్లోనే ఉంచారు. అయితే వారం రోజుల క్రితం సిమ్ బ్లాక్ అయింది. మూడు రోజుల క్రితం కొత్త సిమ్ కూడా తీసుకున్నారు. అయితే డబ్బులు అవసరం ఉండడంతో మొదటగా ఆదోనిలోని కెనరా బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేయగా రూ.లక్ష మాత్రమే ఉందని బ్యాంకు అధికారులు చెప్పారు. రూ.4 లక్షలు పలు దఫాల్లో కట్ అయినట్లు తెలిపారు. తర్వాత బాధిత రైతు బ్యాంకు ఆఫ్ బరోడాకు వెళ్లారు. అక్కడ కూడా బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేయగా రూ.4 లక్షలు కట్ అయినట్లు తెలిసింది. తమిళనాడు, మహారాష్ట్రలోని నాసిక్, కల్కత్తాలోని ఇతర బ్యాంకు ఖాతాలకు రూ.8 లక్షలను మళ్లించినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. బాధిత రైతు హొళగుంద పోలీసులను ఆశ్రయించారు.