విద్యుత్ పోరాటానికి సిద్ధం
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:07 AM
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని, దీనికి వ్యతిరేకంగా విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు.
పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తాం
హామీల అమలులో చిత్తశుద్ధి చూపాలి
ఆగస్టు 5న విద్యుత్ కార్యాలయాలను ముట్టడిస్తాం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఆకట్టుకున్న ప్రజా నాట్యమండలి నృత్యాలు
ఎరుపెక్కిన డోన్ పట్టణం
డోన్ రూరల్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని, దీనికి వ్యతిరేకంగా విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో సీపీఐ నంద్యాల జిల్లా రెండో మహాసభ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కార్యకర్తలను, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీ అమలు కోసం పోరాటాల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని నిల దీస్తామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో చిత్తశుద్ధిని కనబరచాలన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలతో పాటు ఇంటి నిర్మాణాల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే నిధులు మంజూరుచేసి పేదలను ఆదుకుంటామని ఇచ్చిన హామీని విస్మరిస్తుందన్నారు. వచ్చే నెల 5వ తేదీన విద్యుత్ కార్యాలయాల ముట్టడికి సిద్ధం కావాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒంగోలులో వచ్చే నెల 22, 23 తేదీల్లో జరిగే సీపీఐ రాష్ట్ర మహాసభలకు కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు, రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు రామచం ద్రయ్య, రాష్ట్రకార్యవర్గ సభ్యులు జగదీష్, రామాంజనేయులు, నక్కి లెనిన్బాబు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్, రాధాకృష్ణ, సుంకయ్య తదితరులు పాల్గొన్నారు.
భారీ ప్రదర్శన
జిల్లా రెండో మహాసభల సంద ర్భంగా పట్టణంలోని ప్రభుత్వ అతిథిగృహం ప్రధాన రోడ్డు నుంచి బస్టాండ్ వరకు సీపీఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు భారీ ప్రదర్శనను నిర్వహిం చారు. పాతబస్టాండు రైల్వేస్టేషన్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రఽజా నాట్యమండలి కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. నంద్యాల జిల్లాలోని 29మండలాల నుంచి భారీ ఎత్తున సీపీఐ కార్యకర్తలు అభిమా నులు తరలి రావడంతో డోన్ ఎర్రజెండాలతో ఎరుపెక్కింది.